వికెట్లు తీసే బౌలర్ ఒక్కడూ లేడు.. ఈ బౌలింగ్తో టీమిండియా ప్రపంచకప్ గెలవడం కష్టం.. : ఆకాశ్ చోప్రా కామెంట్స్
T20I World Cup 2022: ప్రస్తుత భారత జట్టు బౌలింగ్ చూస్తుంటే రాబోయే టీ20 ప్రపంచకప్ లో టీమిండియా కప్పు కొట్టడం కలే అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. బుమ్రా, హర్షల్ పటేల్ వచ్చాడని ఆనందపడుతున్నా.. వాళ్లు రాగానే భారత బౌలింగ్ రాత మారిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా వరుస వైఫల్యాలపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రస్తుత భారత బౌలింగ్ చూస్తుంటే అసలు టీమిండియా అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశాలు నానాటికీ సన్నగిల్లుతున్నాయని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.
తాజాగా అతడు తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా సంచలన కామెంట్స్ చేశాడు. అసలు భారత బౌలర్లలో వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలరే కనిపించడం లేదని.. బుమ్రా,హర్షల్ వచ్చినంత మాత్రానా జట్టుకు పెద్దగా ఒణగూరేదేమీ లేదని వ్యాఖ్యానించాడు.
ఆకాశ్ మాట్లాడుతూ... ‘మనం బుమ్రా, హర్షల్ పటేల్ వచ్చాడని ఆనందపడుతున్నాం. వాళ్లు రాగానే భారత బౌలింగ్ రాత మారిపోతుందని కాలరెగిరేసుకుంటున్నాం. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. ఈ ఏడాది బుమ్రా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ గొప్ప ప్రదర్శనలేమీ చేయలేదు.
ఒక్క మ్యాచ్ లో ఐదు, ఆరు వికెట్లు తీసి మిగతా మ్యాచ్ లలో రాణించకుంటే సరిపోతుందా..? నా అభిప్రాయం ప్రకారమైతే భారత బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. అసలు వికెట్లు తీసే బౌలర్ ఒక్కరు కూడా కనిపించడం లేదు.
యుజ్వేంద్ర చాహల్ వాస్తవానికి స్పిన్నర్. కానీ అతడు ఫాస్ట్ బంతులు విసరుతున్నాడు. స్లో బంతులు వేయడం లేదు. ఆసియా కప్ లో ఇలాగే చేసి దెబ్బతిన్నాడు. అయినా ఆసీస్ తో మ్యాచ్ లో కూడా అది మానలేదు. అసలు స్పిన్నర్ అనేవాడు స్లో బంతులు వేయకుండా వికెట్లు ఎలా వస్తాయి..?
వాస్తవం ఏమిటంటే టీమిండియా బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. ఈ బౌలింగ్ తో మనం టీ20 ప్రపంచకప్ గెలవగలమన్న నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతున్నది. 208 పరుగులు చేసినా వాటిని మీరు కాపాడుకోలేకపోతున్నారంటేనే అర్థమవుతున్నది మీరెంత బలహీనంగా ఉన్నారో.
ఆస్ట్రేలియా జట్టులో నలుగురు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగింది. అది గుర్తుంచుకోండి. వాళ్లు లేకున్నా భారత బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ బౌలింగ్ తో మెగా టోర్నీలు గెలవడం కష్టమే..’ అని వ్యాఖ్యానించాడు.