- Home
- Sports
- Cricket
- వాళ్లిద్దరినీ ఒప్పించిన దాదా.. ఇక తర్వాత మాస్టర్ బ్లాస్టరేనా..? టీమిండియాలోకి సచిన్ ఎంట్రీపై దాదా ఆన్సర్ ఇదే..
వాళ్లిద్దరినీ ఒప్పించిన దాదా.. ఇక తర్వాత మాస్టర్ బ్లాస్టరేనా..? టీమిండియాలోకి సచిన్ ఎంట్రీపై దాదా ఆన్సర్ ఇదే..
Sourav Ganguly on Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్.. ఆధునిక క్రికెట్ లో ఈ నలుగురు భారత క్రికెట్ లో మూలస్తంబాలుగా పనిచేశారు. వీరిలో సచిన్ తప్ప మిగిలిన ముగ్గురు తిరిగి టీమిండియా సేవలో ఉన్నవారే.

భారత క్రికెట్ దిగ్గజాలుగా పేరొందిన రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లు ఇప్పటికే టీమిండియాకు సేవలందిస్తున్నారు. వీరిలో దాదా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్ కాగా రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్నాడు.
ఇక హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇటీవలే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కి చీఫ్ గా నియమితుడయ్యాడు. తాను బీసీసీఐ లోకి వచ్చిన తర్వాత.. తన కెప్టెన్సీలో పనిచేసిన వారిని తిరిగి టీమిండియాకు తీసుకొస్తున్న గంగూలీ కన్ను తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై పడింది.
రిటైర్మెంట్ తర్వాత ఈ క్రికెట్ దిగ్గజం.. తన వ్యక్తిగత జీవితాన్ని హాయిగా గడుపుతున్నాడు. ముంబై ఇండియన్స్ తో అసోసియేషన్ లో ఉన్నా.. వ్యాపారాలను చూసుకుంటున్నా సచిన్ ధ్యాస మాత్రం ఎప్పటికీ క్రికెట్ మీదే అని దేశంలో పాలు తాగే పిల్లాడికి కూడా తెలుసు.
మరి అంతటి లెజెండ్ ను తిరిగి టీమిండియాకు తీసుకురావాలని గంగూలీ కోరుకుంటున్నాడు. ఇదే విషయమై తాజాగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. ద్రావిడ్, లక్ష్మణ్ ను తీసుకొచ్చారు.. ఇక మిగిలింది సచిన్, సెహ్వాగ్ లేనా..? అని ప్రశ్నించాడు.
దీనికి గంగూలీ సమాధానం చెబుతూ...‘సచిన్ కొంత భిన్నంగా ఉంటాడు. భారత క్రికెట్ లో సచిన్ ప్రమేయం ఏదో విధంగా ఉండాలని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. ఒకవేళ అతడు (సచిన్) దానికి ఒప్పుకుంటే అంతకంటే పెద్ద వార్త మరొకటి ఉండకపోవచ్చు.
అయితే సచిన్.. ఈ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. వాటి జోలికి సచిన్ వెళ్లడు. కానీ ఏదో ఒక దశలో మాత్రం అతడు భారత క్రికెట్ లోకి చేరేందుకు ఒక మార్గాన్ని కనుగొంటాడు అని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను..’ అని గంగూలీ తెలిపాడు.
కాగా.. ఎన్సీఏ హెడ్ గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్ ను టీమిండియా హెడ్ కోచ్ గా ఒప్పించడానికి గంగూలీ చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. అందుకు ద్రావిడ్ విముఖత చూపించినా గంగూలీ మాత్రం పట్టువిడవలేదు. ది వాల్ తో పాటు లక్ష్మణ్ ను కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు కు మార్చాడు బీసీసీఐ చీఫ్. ద్రావిడ్ స్థానాన్ని వీవీఎస్ తో భర్తీ చేయించాడు.