MS Dhoni: ఆదివారం సర్ప్రైజ్ ఇస్తానన్న ధోని.. రిటైర్ అవుతున్నాడా..? సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
MS Dhoni Retirement: టీమిండియాకు రెండు ప్రపంచకప్పులు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఎన్నో మధుర విజయాలను అందించిన మాజీ సారథి ఎంఎస్ ధోని క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోనున్నాడా..?
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మాత్రమే కనిపిస్తున్నాడు. గత సీజన్ లోనే రిటైర్ అవుతాడని ప్రచారం జరిగినా ధోని మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.
వచ్చే సీజన్ లో కూడా ఆడతానని ధోని ఇదివరకే ఐపీఎల్-15 లో చెప్పకనే చెప్పాడు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ధోని ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఆదివారం ధోని కీలక నిర్ణయం ప్రకటించనున్నాడు.
శనివారం ధోని తన ఫేస్బుక్ ఖాతా వేదికగా ‘ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు నేను మీ అందరికీ ఒక ఎగ్జైటింగ్ వార్త చెప్పబోతున్నా. మీ అందరినీ అక్కడ (ఫేస్బుక్ లైవ్) కలుస్తా..’ అని ప్రకటించాడు.
ధోని ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే.. అతడు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వెల్లువెత్తాయి. జాతీయ మీడియాలో కూడా ధోని రిటైర్మెంట్ గురించి చర్చోపచర్చలు జరిగాయి. ఇక సోషల్ మీడియాలో అయితే చెన్నై అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు.
సడెన్ సర్ప్రైజ్ లు ఇవ్వడంలో ధోని దిట్ట. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు కూడా ఇలాగే ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు కూడా ధోని ఇదే పని చేయబోతున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ధోని ఈ పోస్ట్ చేయగానే పలువురు చెన్నై అభిమానులు.. ‘కొంపదీసి గత సీజనే చివరిదా..? ధోని రిటైర్ అవుతాడా..? ఇక చెన్నై చెపాక్ స్టేడియంలో తలైవా ఆటను చూడలేమా..?’ అని మెరీనా తీరాన ఘోషిస్తున్నారు.
ఇదిలాఉండగా ధోని రిటైర్మెంట్ పై సీఎస్కే ఇప్పటివరకూ స్పందించలేదు. ఇది కూడా అభిమానుల అనుమానాలకు తావిస్తున్నది. ఇటువంటి రూమర్లు వచ్చినప్పుడు సీఎస్కే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ దానిమీద వివరణ ఇస్తుంది. కానీ ఇప్పుడు సీఎస్కే యాజమాన్యం కూడా గమ్మునుండటంతో ఏదో విషాద వార్త వినాల్సి వస్తుందని ధోని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. మరి ధోని మనసులో ఏముందో..?