BCCI: బీసీసీఐ అధ్యక్షుడిగా అమిత్ షా కొడుకు..? మరి గంగూలీ పరిస్థితి..!
BCCI - Supreme Court: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లో రాజ్యాంగ సవరణలను ఆమోదిస్తూ బుధవారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో ప్రస్తుత పాలకమండలికి మరోసారి పదవులు చేపట్టే అవకాశం చిక్కింది. ఇక ఇప్పుడు బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా త్వరలోనే..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా త్వరలోనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడు కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. సుప్రీంకోర్టు తాజాగా బీసీసీఐ ప్రతిపాదించిన బోర్డు రాజ్యాంగ సవరణలను ఆమోదించిన తర్వాత ఇప్పుడు భారత క్రికెట్ లో ఈ చర్చ జోరుగా సాగుతున్నది.
‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను రద్దు చేస్తూ బీసీసీఐ ప్రతిపాదించిన సవరణలకు సుప్రీం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు సెక్రటరీగా ఉన్న జై షా మళ్లీ బీసీసీఐలో చక్రం తిప్పే అవకాశాలున్నాయి. దీని ప్రకారం రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తో పాటు బీసీసీఐ లో వరుసగా ఆరేండ్లపాటు (రెండు పర్యాయాలు) పదవీ చేపట్టే అవకాశముంది.
ప్రస్తుతమున్న పాలకమండలి పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్ తో ముగియనుంది. అక్టోబర్ తర్వాత బీసీసీఐలో మళ్లీ ఎన్నికలు నిర్వహించి జై షా ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లు కూడా జై షా అధ్యక్షున్నిచేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన కథనం ప్రకారం.. జై షా ను బీసీసీఐ అధ్యక్షపదవి మీద కూర్చోబెట్టడానికి సుమారు 15 రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ లు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇదే విషయమై ఓ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లో కీలక సభ్యుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడుతూ.. ‘జై షా భారత అత్యున్నత క్రీడా బోర్డుకు అధ్యక్షుడిగా పదవి చేపట్టేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. అన్ని క్రికెట్ అసోసియేషన్లు అతడికే మద్దతుగా ఉన్నాయి..’ అని తెలిపాడు.
గంగూలీ, షా లు 2019 అక్టోబర్ నుంచి వాళ్ల పదవుల్లో కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ వచ్చిన తర్వాత 2020, 2021 లో ఐపీఎల్ ను విజయవంతంగా నిర్వహించడంతో పాటు కొద్దిరోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ మీడియాహక్కుల వేలంతో బోర్డుకు భారీ ఆదాయాన్ని అందించడంలో జై షా కీలకంగా వ్యవహరించారని బోర్డు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో తదుపరి అధ్యక్షుడిగా గంగూలీని కాకుండా జై షాను ఎంపిక చేస్తే మంచిదనే అభిప్రాయంతో బోర్డు సభ్యులున్నట్టు తెలుస్తున్నది.
మరి జై షాను అధ్యక్షుడిగా చేస్తే గంగూలీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా తలెత్తుతున్నది. అయితే దాదాను ఐసీసీకి పంపించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నట్టు సమాచారం. వచ్చే అక్టోబర్ లోనే ఐసీసీ అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లీ తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. దీంతో గంగూలీని ఐసీసీ అధ్యక్ష పదవి మీద కూర్చోబెట్టి జై షాను బీసీసీఐ సింహాసనం అధిష్టించేందుకు సన్నాహాకాలు జరుగుతున్నాయని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ఒకవేళ గంగూలీని పంపకుండా ఇక్కడే ఆపగలిగితే ఐసీసీలో బీసీసీఐ ప్రతినిధిగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్. శ్రీనివాసన్ ను పంపించనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. శ్రీనివాసన్ ఎవరో కాదు.. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్.