David Warner: వార్నర్ ను పక్కనబెట్టడానికి కారణమదే.. అసలు విషయం చెప్పిన సన్ రైజర్స్ అసిస్టెంట్ కోచ్
David Warner: ఫామ్ లో లేడనే కారణంతో వార్నర్ భాయ్ ను తప్పించడంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఫైర్ అయ్యారు.2015 నుంచి ఐపీఎల్ లో హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. ఒక్క సీజన్ లో కొన్ని మ్యాచ్ లు సరిగ్గా ఆడలేదని పక్కనబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్-14 రెండో దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న డేవిడ్ వార్నర్ కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా పక్కనబెట్టడం వివాదాస్పదమైంది. ఫామ్ లో లేడనే కారణంతో వార్నర్ భాయ్ ను తప్పించడంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఫైర్ అయ్యారు.
అయితే తనను కెప్టెన్సీ తో పాటు జట్టు నుంచి పక్కనబెట్టడంపై గల కారణాలను తనకు కనీసం చెప్పలేదని ఆ తర్వాత వార్నర్ వాపోయాడు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన వార్నర్.. తనను దారుణంగా అవమానించారని, హైదరాబాద్ తో ఇక తన ప్రయాణం ముగిసినట్టే అని చెప్పాడు.
2015 నుంచి ఐపీఎల్ లో హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. ఒక్క సీజన్ లో కొన్ని మ్యాచ్ లు సరిగ్గా ఆడలేదని, మ్యాచులు గెలిపిండచం లేదని పక్కనబెట్టడంపై అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం గురించి ఇంతవరకు టీమ్ మేనేజ్మెంట్ గానీ, కోచింగ్ గానీ స్పందించింది లేదు.
కానీ ఇదే విషయమై తొలిసారిగా సన్ రైజర్స్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హడిన్ స్పందించాడు. ఐపీఎల్ రెండో దశలో వార్నర్ భాయ్ ను పక్కనబెట్టడానికి గల కారణాలను వివరించాడు.
హడిన్ మాట్లాడుతూ.. ‘అది (వార్నర్ ను తుది జట్టులోంచి తప్పించడం) క్రికెట్ నిర్ణయం కాదు. అతడిని ఆడించకపోవడానికి కారణం వార్నర్ ఫామ్ లో లేడని కాదు. అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ లేదు.
ఐపీఎల్ కు ముందు వార్నర్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఆసీస్ బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్ లకు వెళ్లినా వార్నర్ మాత్రం వాటిలో పాల్గొనలేదు. ఎవరు ఒప్పుకున్నా లేకున్నా అతడు మంచి క్రికెటరే. అందులో సందేహమే లేదు.
బంతిని బాదడంలో వార్నర్ కు సాటి ఎవరూ లేరు. కానీ పరిస్థితులు మా చేతుల్లో లేవు. కోచింగ్ స్టాఫ్ కూడా ఈ విషయంలో నిస్సహాయులుగా ఉన్నాం. అందరూ అతడిని ఫామ్ లో లేడని తీసేశారని అనుకున్నారు. అది అసలు కారణమే కాదు. అతడికి కొంత మ్యాచ్ ప్రాక్టీస్ కావాలని మాత్రమే మేము అనుకున్నాం. దాంతో అతడు తిరిగి లయ అందుకోగలడని భావించాం..’ అంటూ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ లో తనను పక్కనబెట్టారని కసో లేక మరేదైనా కారణమో గానీ రెండ్రోజుల క్రితం ముగిసిన టీ20 ప్రపంచకప్ లో వార్నర్ భాయ్ మళ్లీ తన విశ్వరూపం చూపించాడు. ఈ టోర్నీ లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానంలో ఉన్న వార్నర్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా కూడా ఎంపికయ్యాడు.
ఏడు ఇన్నింగ్స్ లలో వార్నర్.. 289 పరుగులు చేసి ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం అని నిరూపించాడు. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో వార్నర్ ఆడిన ఇన్నింగ్సులను క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. ఇంతటి విలువైన ప్లేయర్ ను నాలుగైదు మ్యాచులు ఆడలేదని సన్ రైజర్స్ వదిలేసుకుందా..? అని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు బాధపడుతున్నారు.