- Home
- Sports
- Cricket
- టీమిండియాలో మిస్ అవుతోంది అదే, అందుకే వరల్డ్ కప్ ఓడిపోయాం... సురేష్ రైనా కామెంట్...
టీమిండియాలో మిస్ అవుతోంది అదే, అందుకే వరల్డ్ కప్ ఓడిపోయాం... సురేష్ రైనా కామెంట్...
ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన భారత జట్టు, 2013 తర్వాత గత 8 ఏళ్లల్లో ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయింది. 2019 వన్డే వరల్డ్కప్, 2021 టీ20 వరల్డ్ కప్తో పాటు డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లోనూ హాట్ ఫెవరెట్గా బరిలో దిగి ఓటమి పాలైంది...

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో మొదటి టీ20 వరల్డ్కప్ గెలిచిన టీమిండియా, ఆ తర్వాత మాహీ కెప్టెన్సీలో ఐదు పొట్టి ప్రపంచకప్ టోర్నీలు ఆడినా టైటిల్ సాధించలేకపోయింది...
2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న సురేష్ రైనా, ఆ తర్వాత భారత జట్టు ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోవడానికి గల కారణాలను వివరించాడు...
‘2007 టీ20 వరల్డ్కప్ కానీ, ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలవడానికి ఆరో బౌలింగ్ ఆప్షన్ను అద్భుతంగా వాడుకోవడమే కారణం...
మేం రంజీ ఆడే సమయంలోనే మా కోచ్ జ్ఞాను భాయ్ (జ్ఞానేందర్ పాండే) ఎప్పుడూ మీరు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెబుతూ ఉండేవాళ్లు...
బ్యాటింగ్, ఫీల్డింగ్ మాత్రమే కాదు బౌలింగ్ చేయడం కూడా ప్రతీ క్రికెటర్ బాధ్యత అంటుండేవారు. టీమ్లో బౌలింగ్ వేసే ప్లేయర్లు అందుబాటులో ఉన్నప్పుడు వారిని సరిగా వాడుకునే బాధ్యత కెప్టెన్పైనే ఉంటుంది...
కేవలం ఐదుగురు బౌలర్లతోనే ఆడడం సరికాదు. టీమ్లో ఉండే ఐదుగురు బౌలర్లను ఎదుర్కోవడానికి ప్రత్యర్థి టీమ్ స్టడీ చేసి, ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తుంది...
అందుకే ఆరో, ఏడో బౌలింగ్ ఆప్షన్షను వాడుకుంటే భాగస్వామ్యాలను విడదీసే అవకాశం దొరుకుతుంది. అప్పుడు జట్టులో నాతో పాటు వీరూ పా (వీరేంద్ర సెహ్వాగ్), యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్ 2011 వన్డే వరల్డ్కప్లో కూడా బౌలింగ్ చేశాం...
2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయాం, తాజాగా టీ20 వరల్డ్ కప్ టోర్నీలోనూ ఓడాం. ఈ రెండు ఓటములకు ఆరో బౌలర్ అందుబాటులో లేకపోవడమే కారణం...
రోహిత్ శర్మ బౌలింగ్ చేయగలడు. శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్పై దృష్టి పెడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ చేయగలడు... కాబట్టి ఆరో బౌలర్ను వాడుకోవాలి...
నెట్స్లో ఓ ఆరు- ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేస్తే, మ్యాచ్లో ఎలా బౌలింగ్ చేయాలో ఐడియా వస్తుంది. సచిన్ టెండూల్కర్ కూడా జట్టుకి అవసరమైతే బౌలింగ్ చేసేవారు...
కాబట్టి బ్యాటర్లు బౌలింగ్పై దృష్టి పెడితే, ఈజీగా ఐదారు ఓవర్లు వేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆరు, ఏడో బౌలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటే రెగ్యూలర్ బౌలర్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా..
టీమిండియా తరుపున 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు, 18 టెస్టులు ఆడిన సురేష్ రైనా, మొత్తంగా కలిపి తన కెరీర్లో 62 వికెట్లు పడగొట్టాడు...