ఆ ఒక్కదాని కోసమే రోహిత్ శర్మ రెస్ట్ కూడా వద్దని చెప్పాడా... న్యూజిలాండ్తో టీ20 సిరీస్కి...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో భారత జట్టు పేలవ ప్రదర్శనకు అందరూ చెప్పిన కారణం బిజీ షెడ్యూల్. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాతో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే మాట చెప్పుకొచ్చారు...
ఐపీఎల్ 2021 ఫస్టాఫ్ ముగిసిన తర్వత ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్, ఐపీఎల్ సెకండాఫ్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ అంటూ వరుసగా బిజీ బిజీ క్రికెట్ ఆడింది భారత జట్టు...
ఐపీఎల్ సెకండాఫ్ ముగిసిన తర్వాత వారం రోజుల విశ్రాంతి దొరికి ఉన్నా, ఫలితం, పర్ఫామెన్స్ వేరేగా ఉండేదని, ఇలాంటి బయో బబుల్లో ఉంటే ది గ్రేట్ డాన్ బ్రాడ్మన్ అయినా సరే సరిగా ఆడలేడంటూ కామెంట్లు చేశాడు టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి...
అయితే టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత వారం రోజులకే న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే ఈ టీ20 సిరీస్కి జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ...
డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడిన ప్లేయర్లకు ఈ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని భావించింది భారత క్రికెట్ బోర్డు. న్యూజిలాండ్ కూడా టీ20 వరల్డ్కప్ టోర్నీ ఆడి వస్తుంది కాబట్టి బీ టీమ్తో పొట్టి ఫార్మాట్ ఆడితే సరిపోతుందని అనుకున్నారు...
అయితే న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కి ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా బిజీ క్రికెట్ని ఏ మాత్రం ఇష్టపడని రోహిత్ రెస్టు తీసుకోకపోవడం షాక్కి గురి చేసింది...
రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడానికి ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నాడు. దాదాపు మూడేళ్ల క్రితం 2018 ఆసియా కప్ గెలిచిన తర్వాత అవకాశం వస్తే, టీ20 కెప్టెన్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మీడియా సమావేశంలో చెప్పాడు రోహిత్...
దాంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి రోహిత్ శర్మ, సిద్ధంగా లేడని... అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కెప్టెన్గా బాధ్యతలు సిద్ధమైపోయాడనట్టు సోషల్ మీడియాలో టాక్ వినబడుతోంది...
నవంబర్ 17 నుంచి మొదలయ్యే న్యూజిలాండ్తో టీ20 సిరీస్, రెండు టెస్టులు ఆడిన తర్వాత టీమిండియా, సౌతాఫ్రికా టూర్కి బయలు దేరి వెళ్లనుంది. ఒకవేళ న్యూజిలాండ్తో టీ20 సిరీస్ నుంచి రోహిత్ విశ్రాంతి తీసుకుంటే, వచ్చే ఏడాది జనవరి 19న కేప్టౌన్లో సౌతాఫ్రికా జరిగే మొదటి టీ20 దాకా వేచి చూడాల్సి వస్తుంది...
అది కూడా విదేశీ పిచ్లపై, టీమిండియాకి ఏ మాత్రం మెరుగైన రికార్డు లేని సౌతాఫ్రికాలో... అందుకే పూర్తి స్థాయి కెప్టెన్గా మొదలెట్టే సిరీస్ ఏదో, ఇక్కడ ప్రారంభిస్తేనే బాగుంటుందని రోహిత్ శర్మ భావించి ఉంటాడని సమాచారం...
పూర్తి స్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మ మొదటి సిరీస్ కావడంతో గెలుపు గుర్రాలైన కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ కావాలని పట్టుబట్టాడని, వాళ్లు కూడా అంగీకరించడంతో ఆ ఇద్దరినీ న్యూజిలాండ్ సిరీస్కి ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్తో మొదలయ్యే టీ20 సిరీస్ ముగిసిన తర్వాత రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది టీమిండియా. నవంబర్ 25న కాన్పూర్లో మొదటి టెస్టు, డిసెంబర్ 3న ముంబైలో రెండో టెస్టు జరుగుతాయి...
టీ20 సిరీస్ ముగిసిన తర్వత అవసరమైతే ఈ టెస్టు సిరీస్ నుంచి దూరంగా ఉండాలని రోహిత్ శర్మ భావస్తున్నాడని సమాచారం. ఇప్పటికే కెఎల్ రాహుల్, శుబ్మన్ గిల్ మధ్య టెస్టు ఓపెనర్ ప్లేస్ కోసం తీవ్రమైన పోటీ ఉంది...
కాబట్టి రోహిత్ శర్మ లేకపోయినా స్వదేశంలో ఆడే సిరీస్ కాబట్టి టీమిండియాపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 7న న్యూజిలాండ్తో రెండో టెస్టు ముగియనుంది...
ఆ తర్వాత వెంటనే సౌతాఫ్రికా టూర్కి వెళ్లే టీమిండియా, డిసెంబర్ 17 నుంచి మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచుల సిరీస్లు ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తుంది...
సౌతాఫ్రికా టూర్ జనవరి 26 రిప్లబిక్ డే రోజు జరిగే ఆఖరి టీ20 మ్యాచ్తో ముగిస్తే, ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్తో కలిసి స్వదేశంలో మూడే వన్డేలు, మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది భారత జట్టు...