ఇదేం కెప్టెన్సీ గబ్బర్... బీమర్లు వేసే సీనియర్ బౌలర్ను జట్టులో ఉంచుకుని, ఇలా...
రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు, శ్రీలంక చేతిలో పోరాడి ఓడింది. ఆఖరి రెండు ఓవర్లలో 20 పరుగులు కావాల్సిన దశలో భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్లో 12 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్లో ఈజీగా విజయాన్ని అందుకుంది లంక జట్టు...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, బ్యాటింగ్లో పెద్దగా డెప్త్ లేకపోవడంతో కాస్త జాగ్రత్తగా ఆడి భారీ స్కోరు చేయలేకపోయింది. అయితే స్పిన్నర్లు అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఆఖరి ఓవర్ దాకా రేసులో నిలిచింది భారత జట్టు.
శ్రీలంక జట్టు ఈ మ్యాచ్లో ఏకంగా 8 మంది బౌలర్లను ఉపయోగిస్తే, భారత కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రం జట్టులో ఉన్న సీనియర్ బౌలర్కి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అయ్యింది...
భువనేశ్వర్ కుమార్తో ఓపెనింగ్ బౌలింగ్ వేయించిన గబ్బర్, మరో ఎండ్లో చేతన్ సకారియాకి బంతిని అందించాడు. ఈ ఇద్దరి తర్వాత స్పిన్నర్లను బరిలో దింపాడు. అయితే జట్టులో ఉన్న సీనియర్ పేసర్ నవ్దీప్ సైనీని మాత్రం గబ్బర్ పట్టించుకోలేదు...
భయంకరమైన బీమర్లు వేస్తూ, ప్రత్యర్థి బ్యాట్స్మెన్ వెన్నులో వణుకుపుట్టించే నవ్దీప్ సైనీకి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదనే క్రికెట్ ఫ్యాన్స్కి అర్థం కాలేదు...
ఇప్పటికే 10 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న నవ్దీప్ సైనీకి రెండు ఓవర్లు బౌలింగ్ ఇచ్చినా, రిజల్ట్ వేరేగా ఉండదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
నవ్దీప్ సైనీతో 16వ ఓవర్ నుంచి బౌలింగ్ వేయించినా, రెండు లేదా మూడు ఓవర్లు వేయించే అవకాశం దక్కేది. కానీ శిఖర్ ధావన్ మాత్రం సైనీని ఏ మాత్రం పట్టించుకోలేదు.
భువీ వేసిన 19వ ఓవర్లో ఓ క్యాచ్ను అందుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన నవ్దీప్ సైనీ గాయపడ్డాడు. నేటి మ్యాచ్లో అతను బరిలో దిగుతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.
నవ్దీప్ సైనీ గాయపడడంతో తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చిన చేతన్ సకారియాతో ఆఖరి ఓవర్ వేయించాల్సి వచ్చింది. పెద్దగా అనుభవం లేకపోయినా ఆకట్టుకునే స్పెల్ వేసిన సకారియా, జట్టుకి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.
ఆస్ట్రేలియా టూర్లో ఆఖరి టెస్టులో బరిలో దిగిన నవ్దీప్ సైనీ, ఆ మ్యాచ్లో గాయపడి కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ గాయం కారణంగానే ఐపీఎల్ 2021 సీజన్లోనూ ఒకే మ్యాచ్ ఆడాడు సైనీ... అందులో వేసింది రెండు ఓవర్లే...
నవ్దీప్ సైనీ గాయంపై ఇంకా పూర్తి క్లారిటీ లేకపోవడం, భారత జట్టులో మరో ప్లేయర్ను తీసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్లే అతనికి తుదిజట్టులో చోటు ఇచ్చారని భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్...
రెండో టీ20లో గాయపడిన నవ్దీప్ సైనీ, నేటి మ్యాచ్లో బరిలో దిగకపోతే, స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికైన వారిలో ఒకరికి తుదిజట్టులో చోటు దక్కే అవకాశం దొరుకుతుంది...