కోహ్లీ ఆడాడా? రోహిత్ ఆడాడా? పూజారాని మాత్రం ఎందుకు బలి చేశారు... సెలక్టర్లపై సునీల్ గవాస్కర్ ఫైర్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ ముగిసిన వెస్టిండీస్ టూర్కి ఎంపిక చేసిన జట్టులో సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ యూనిట్ మూకుమ్మడిగా ఫెయిల్ అయినా పూజారాని మాత్రం ఎందుకు బలిపశువు చేశారంటూ ఫైర్ అయ్యాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
Rohit and Pujara
‘ఛతేశ్వర్ పూజారాని ఎందుకు తప్పించారు? భారత బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఫెయిల్ అయినప్పుడు అతన్ని మాత్రం ఎందుకు బలిపశువుని చేశారు? విరాట్ కోహ్లీ బాగా ఆడాడా? రోహిత్ శర్మ బాగా ఆడాడా? శుబ్మన్ గిల్ కూడా ఒరగబెట్టిందేమీ లేదే...
ఛతేశ్వర్ పూజారా ఎన్నో ఏళ్లుగా టీమిండియాకి ఓ నమ్మకమైన, సైలెంట్ బ్యాటర్. అతను 100కి పైగా టెస్టులు ఆడి టీమ్కి ఎన్నో విజయాలు కూడా అందించాడు.
కేవలం అతనికి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు లేరనే ఉద్దేశంతోనే పూజారాని తప్పించారని అనిపిస్తోంది..
పూజారాని తీసేసినా ఎవరూ అడగరు. అదే విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మనో పక్కనబెడితే ఫ్యాన్స్ గగ్గోలు పెడతారు? చాలామందికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. సరే.. ఫైనల్లో ఫెయిల్ అయ్యాడని పూజారాని పక్కనబెట్టారని అనుకుందాం.. మరి మిగిలిన వారిని ఎందుకు సెలక్ట్ చేశారు..
Image credit: PTI
అయినా టీమ్ని ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ, మీడియా సమావేశం ఎందుకు పెట్టడం లేదు. వాళ్లు వేసే ప్రశ్నలకు సెలక్షన్ కమిటీ దగ్గర జవాబులు లేవనే కదా? పూజారా కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో ఎంతో అనుభవం ఉంది..
ఈరోజు 39-40 ఏళ్లు వచ్చే వరకూ టెస్టుల్లో ఆడుతున్నారు. పూజారాకి కూడా నాలుగైదేళ్ల కెరీర్ ఉంది. అజింకా రహానే తప్ప, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏ బ్యాటర్ కూడా సరిగా ఆడలేదు. అయినా పూజారాని మాత్రమే టార్గెట్ చేసి చేతులు దులుపుకోవడానికి కారణం ఏంటో సెలక్టర్లు చెప్పాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..