టీమిండియాని భయపడుతున్న ఆ ఒక్క ఓవర్... 19వ ఓవర్ సరిగ్గా వేసే వీరుడెవ్వడు?
ఆసియా కప్ 2022 టోర్నీని టైటిల్ ఫెవరెట్గా ఆరంభించింది భారత జట్టు. అయితే అనుకోని విధంగా పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడిన భారత జట్టు, ఆస్ట్రేలియాతో మొదటి టీ20లోనూ చిత్తుగా ఓడింది. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలు అందుకుంది భారత జట్టు. అయినా భారత క్రికెట్ ఫ్యాన్స్ సంతోషంగా లేరు, కారణం భారత బౌలర్ల వైఫల్యం కొనసాగుతూ ఉండడమే...
Arshdeep Singh
ఆస్ట్రేలియాపై గెలిచిన రెండు మ్యాచులు కూడా టాస్ గెలిచి, ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించి ఆ లక్ష్యాన్ని ఛేదించి తెచ్చుకున్నవే... టాస్ ఓడిన మ్యాచుల్లో భారత జట్టును భయం వెంటాడుతూనే ఉంది. తిరువనంతపురంలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో పిచ్, టీమిండియాకి బాగా అనుకూలించింది...
గౌహతిలో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు హాఫ్ సెంచరీతో పాటు కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ బ్యాటు ఝులిపించడంతో 237 పరుగుల భారీ స్కోరు చేసింది భారత జట్టు. ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటూ 16 పరుగుల తేడాతో గెలిచి గట్టెక్కగలిగింది భారత జట్టు..
అయితే 237 పరుగుల భారీ స్కోరు చేసినా కేవలం 16 పరుగుల తేడాతో గెలవడం భారత బౌలర్ల వైఫల్యానికి నిదర్శనమే. దీపక్ చాహార్ మొదటి ఓవర్లో పరుగులేమీ ఇవ్వలేదు. దీపక్ చాహార్ మెయిడిన్ ఓవర్తో ప్రారంభిస్తే అర్ష్దీప్ సింగ్ రెండో ఓవర్లో 2 వికెట్లు తీశాడు. భువమా, రస్సో డకౌట్ అయ్యారు. అయినా సౌతాఫ్రికా 221 పరుగులను చేరుకోగలిగింది..
ముఖ్యంగా మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే 19వ ఓవర్ వేసేందుకు సరైన బౌలర్ కోసం టీమిండియా వెతుకులాట కొనసాగుతూనే ఉంది. ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లలో 26 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ 19 పరుగులు సమర్పించేసి... మ్యాచ్ని పాక్ చేతుల్లో పెట్టేశాడు...
Bhuvneshwar Kumar
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ భువీపైన నమ్మకంతో అతనికే 19వ ఓవర్ ఇచ్చాడు రోహిత్ శర్మ. ఆ మ్యాచ్లోనూ 14 పరుగులు ఇచ్చిన భువీ, మ్యాచ్ని లంకకి అప్పగించాడు. ఈ రెండు మ్యాచుల్లో 20వ ఓవర్ని కట్టుదిట్టంగా వేసి ఆకట్టుకున్నాడు అర్ష్దీప్ సింగ్...
bumrah
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో గాయం నుంచి కోలుకున్న జస్ప్రిత్ బుమ్రాకి 19వ ఓవర్ వేసే బాధ్యత అప్పగించాడు రోహిత్ శర్మ. అయితే ఈ ఓవర్లో బుమ్రా రెండు సిక్సర్లు, ఓ ఫోర్తో 18 పరుగులు సమర్పించాడు. దీంతో టీ20 కెరీర్లో మొట్టమొదటిసారిగా బుమ్రా 50 పరుగులు సమర్పించి చెత్త రికార్డు నెలకొల్పాడు...
arshdeep
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 19వ ఓవర్ వేసే బాధ్యతలను యంగ్ బౌలర్ అర్ష్దీప్ సింగ్కి అప్పగించాడు రోహిత్ శర్మ. అప్పటికే హర్షల్ పటేల్, దీపక్ చాహార్ కోటా ముగియడంతో 19వ ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్... ఏకంగా 26 పరుగులు సమర్పించాడు. నో బాల్తో మొదలెట్టి ఓ వైడ్తో 6,4,4,2,6 ఇచ్చి 4 ఓవర్లలో 62 పరుగులు అప్పగించాడు...
అర్ష్దీప్ సింగ్ కెరీర్లో ఇదే చెత్త రికార్డు. ఇంతకుముందు భువనేశ్వర్ కుమార్ 19వ ఓవర్ స్పెషలిస్టుగా ఉండేవాడు. భువీ 19వ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్ని ఇబ్బంది పెడితే, 20వ ఓవర్ వేసే బుమ్రా... కథను ముగించేవాడు. ఇప్పుడు భువీ ఫామ్లో లేకపోవడం, బుమ్రా గాయపడడంతో 19వ ఓవర్, టీమిండియాని తెగ కంగారు పెడుతోంది..