ఆ సమయంలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ మధ్య గొడవ... ఎమ్మెస్ ధోనీ ఏం చెప్పాడంటే...
భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్లో పరిస్థితులు సరిగా లేవనే వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. రోహిత్ శర్మకు, కోహ్లీకి అస్సలు పడడం లేదని వార్తలు రాగా, ఆ వార్తలకు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు విరాట్. దీంతో కోహ్లీ వర్సెస్ రోహిత్గా సాగిన వార్తలు కాస్తా, విరాట్ వర్సెస్ బీసీసీఐగా మారాయి...

ఈ వరుస సంఘటనల కారణంగా విరాట్ కోహ్లీకి బీసీసీఐ నుంచి సపోర్ట్ దక్కడం లేదని, రోహిత్ శర్మకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు బీసీసీఐ సపోర్టు ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి...
ఇలాంటి వార్తలు టీమిండియాకి కొత్తేమీ కాదు. ఇంతకుముందు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్గా ఉన్న సమయంలో ఓపెనర్ శిఖర్ ధావన్, వన్డౌన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య వైరం తారాస్థాయికి చేరిందని వార్తలు వచ్చాయి...
విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ డ్రెస్సింగ్ రూమ్లో కొట్టుకున్నారని, అప్పటి టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి స్వయంగా కల్పించుకుని ఈ ఇద్దరినీ విడదీశాడని వార్తలు షికార్లు చేశాయి...
2014లో ఆస్ట్రేలియా టూర్లో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ మధ్య ఫైట్ నడుస్తోందన్న వార్తలకు తన స్టైల్లో ఫుల్స్టాప్ పెట్టాడు అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...
‘అవును, ఆ ఫైట్ నిజమే. విరాట్ కోహ్లీ ఓ కత్తి తీసుకుని, శిఖర్ ధావన్ని పొడిచేశాడు. శిఖర్, దాని నుంచి కోలుకుని బ్యాటుతో అతన్ని తోసేశాడు...
ఇవన్నీ ఉట్టి పుకార్లే... మార్వెల్, ఇంకా వార్నర్ బ్రదర్స్ వాళ్లు వీటిని తీసుకుని ఓ మంచి సినిమా తీయొచ్చనుకుంటా. ఇలాంటి వార్తలు ఎవరు చెబుతున్నారో, వారి పేరు చెబితే... నేను సినిమా వాళ్లకి రికమెండ్ చేస్తాను...
ఎందుకంటే ఇలాంటి కథనాలు రాయాలంటే ఎంతటి ఊహాత్మక శక్తి ఉండాలి, వాళ్లు సినిమాల్లో పనిచేస్తే, టాప్ పొజిషన్లోకి వెళతారు... డ్రెస్సింగ్ రూమ్లో జరగని దాన్ని, లేని దాన్ని ఊహించుకొని రాసేస్తారు..
ఇలాంటి వార్తలు అమ్ముకోడానికి బాగా ఉంటాయేమో, కానీ నిజంగా అలాంటిదేమీ లేదు... వాళిద్దరూ మంచి స్నేహితులు కూడా...’ అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పుకొచ్చాడు ఎమ్మెస్ ధోనీ...
ప్రస్తుతం రోహిత్ శర్మకీ, తనకీ మధ్య గొడవలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై స్పందించిన విరాట్ కోహ్లీ, అలాంటిదేమీ లేదని రెండున్నరేళ్లుగా చెబుతూనే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చాడు...
అయితే తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టుగా గంటన్నర ముందే చెప్పారని, ఎవ్వరూ తనను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని అడగలేదని విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి...