వసీం జాఫర్ రాజీనామా... శిక్షణ సమయంలో నమాజ్లు, మౌలానాలు! మతపరమైన పక్షపాతం చూపించారంటూ ఆరోపణలు...
భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్, ఉత్తరాఖండ్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో విజయ్ హాజారే ట్రోఫీ ప్రారంభం కాబోతున్న సమయంలో జాఫర్, అర్ధాంతరంగా కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై వివాదం రేగింది. ఏ మాత్రం అర్హత లేని ప్లేయర్లను జట్టుకి ఎంపిక చేస్తున్నారని జాఫర్ ఆరోపిస్తే... వసీం జాఫర్ ఆటగాళ్ల ఎంపిక విషయంలో మతపరమైన పక్షపాతం చూపించారని ఉత్తరాఖండ్ క్రికెట్ బోర్డు ఆరోపణలు చేసింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్గా వ్యవహారిస్తున్న వసీం జాఫర్, దేశవాళీ క్రికెట్లో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేశారు. అత్యధిక రంజీ మ్యాచులు, దేశవాళీ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఉన్నాడు వసీం జాఫర్. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ సమయంలో ఉత్తరాఖండ్ కోచ్గా వ్యవహారించాడు వసీం జాఫర్...
ఉత్తరాఖండ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన వసీం జాఫర్, క్రికెట్ బోర్డులో కొన్ని సంచలన మార్పులు చేశాడు. ఇవే ఇప్పుడు వసీం జాఫర్ మతపరమైన పక్షపాతం చూపిస్తున్నాడని ఆరోపణలు రావడానికి కారణమయ్యాయి. ఉత్తరాఖండ్ జట్టుకి ఇంతకుముందు ఉన్న స్లోగన్ని మార్చాడు వసీం జాఫర్...
వసీం జాఫర్ కోచ్ బాధ్యతలు స్వీకరించక ముందు ‘ఉత్తరాఖండ్ జై’ అని ఉత్తరాఖండ్ జట్టుకి స్లోగన్గా ఉండేది. అయితే ఇది మతపరమైన నమ్మకాలకు సూచికగా ఉందని అభిప్రాయపడిన వసీం జాఫర్... దాని స్థానంలో ‘గో ఉత్తరాఖండ్’ అంటూ కొత్త స్లోగన్ను చేర్చాడు...
ఉత్తరాఖండ్ ప్లేయర్ ఇక్బాల్ అబ్దుల్లాను ఉత్తరాఖండ్ కెప్టెన్గా నియమించాలని సూచించాడని, బయో బబుల్లోకి మత గురువులను తీసుకొచ్చి, నమాజ్, మతపరమైన ప్రార్థనలు చేయించాడని వసీం జాఫర్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు.
ఈ ఆరోపణలను మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఖండించాడు. ‘క్రికెట్లోకి మతపరమైన అంశాలను తీసుకురావడం చాలా బాధగా ఉంది. అయితే నాపై వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు... ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్గా చేయాలని నేనెప్పుడూ పట్టుబట్టలేదు. జై బిస్టాను కెప్టెన్ చేయాలని భావించాను. కానీ మిగిలిన సెలక్టర్లు ఇక్బాల్ను కెప్టెన్గా నియమించాలని కోరారు. ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న సీనియర్ ఆటగాడు కావడంతో నేను కూడా ఒప్పుకున్నాను...
బయో బబుల్లోకి నేను ఎప్పుడూ ఏ మతగురువులను తీసుకు రాలేదు. ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చాను... డెహ్రాడూన్లో శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినప్పుడు మూడుసార్లు మౌలానా వచ్చారు. ఆయన్ని నేను పిలవలేదు. ఇక్బాల్ అబ్దుల్లా నా అనుమతితో ఆయన్ని తీసుకొచ్చాడు.. దీన్ని పెద్ద విషయం చేస్తారని అనుకోలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు వసీం జాఫర్.
భారత జట్టులో సభ్యుడిగా 31 టెస్టులు మాత్రమే ఆడినా, దేశవాళీ క్రికెట్లో సుదీర్ఘ కాలం క్రికెటర్గా కొనసాగాడు వసీం జాఫర్. 41 ఏళ్ల వయసులో 2020 మార్చిలో క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన వసీం జాఫర్, ట్విట్టర్లో క్రికెట్ మీమీ క్రియేటర్గా మంచి ఆదరణ తెచ్చుకున్నాడు.