బాబర్ వల్లే భారత్తో మ్యాచ్ ఓడాం.. : పాక్ మాజీ సారథి ఘాటు వ్యాఖ్యలు
Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా రెండ్రోజుల క్రితం భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఇందుకు పాక్ మాజీలు ఆ జట్టు కెప్టెన్ ను నిందిస్తున్నారు.

ఇండియా-పాకిస్తాన్ మధ్య ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వద్ద ముగిసిన హై ఓల్టేజీ మ్యాచ్ లో రోహిత్ సేన.. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచే అవకాశాలున్నా చేజేతులా వాటిని పాడుచేసుకున్నారని ఆ జట్టు మాజీలు బాబర్ ఆజమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా పాక్ సారథి బాబర్ ఆజమ్ నిర్ణయాల వల్లే పాక్ ఓటమి పాలైందని.. అతడు బౌలర్లను సక్రమంగా వినియోగించుకోలేదని పాకిస్తాన్ మాజీ సారథి వసీం అక్రమ్ అబిప్రాయపడ్డాడు. ఓ క్రీడా ఛానెల్ లో జరిగిన చర్చలో అక్రమ్.. బాబర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ పిచ్ (దుబాయ్) అంటే చాలా ఇష్టం. ఇక్కడ రెండు వైపులా బౌలర్లు బౌన్సర్లు విసిరి వికెట్లు సాధించే అవకాశముంటుంది. పిచ్ మీద మంచి బౌన్స్ ఉంటుంది. ఇక్కడ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చివరిఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది.
అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాటర్ గానే గాక కెప్టెన్ గా కూడా విఫలమయ్యాడు. బ్యాటర్ గా ఓపెనర్ గా వచ్చి 10 పరుగులకే ఔటైన అతడు.. కెప్టెన్ గా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా వికెట్లను తీసిన స్నిన్నర్ మహ్మద్ నవాజ్ ను అతడు సరిగా ఉపయోగించుకోలేదు. అతడిని 13, 14వ ఓవర్ బౌలింగ్ చేయిస్తే బాగుండేది. మరో ముఖ్యమైన విషయం టీ20లలో చివరి మూడు లేదా నాలుగు ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించకూడదు. అదీ రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా వంటి హిట్టర్లు క్రీజులో ఉన్నప్పుడు అస్సలు అలా చేయలేం.
పాక్ బౌలర్లంతా ఈ మ్యాచ్ లో బాగా బౌలింగ్ చేశారు. జట్టును గెలిపించడానికి వారి వంతు సాయం చేశారు. నవాజ్ ఆకట్టుకున్నాడు. నసీం షా తొలి మ్యాచ్ లోనే అద్భుతంగా బౌలింగ్ చేశాడు..’ అని అన్నాడు.