Virat Kohli: వెయ్యి రోజులుగా సెంచరీ కొట్టకపోయినా శతకానికి అడుగుదూరంలో కోహ్లీ..
Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు అడుగుదూరంలో నిలిచాడు. ఆసియా కప్ లో ఆదివారం పాకిస్తాన్ తో జరుగబోయే మ్యాచ్ లో కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు.
Image credit: Getty
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు ఒక అడుగుదూరంలో ఉన్నాడు. దశాబ్దకాలంగా ప్రపంచక్రికెట్ను ఏలుతున్న కోహ్లీ.. మూడు ఫార్మాట్లలోనూ వంద మ్యాచ్ లు ఆడిన తొలి భారత క్రికెటర్ గా రికార్డులకెక్కనున్నాడు.
ఆదివారం పాకిస్తాన్ తో జరుగబోయే మ్యాచ్.. కోహ్లీకి అంతర్జాతీయ టీ20 కెరీర్ లో వందోవది. ఇలా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ కోహ్లీ మాత్రమే.
కోహ్లీ ఇదివరకే 262 వన్డేలు, 102 టెస్టులు ఆడాడు. ఇప్పటివరకు 99 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఆదివారం పాక్ తో అతడు ఆడబోయేది వందో మ్యాచ్ కావడం గమనార్హం. దీంతో అతడు మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా నిలవనున్నాడు.
99 టీ20 మ్యాచ్ లలో కోహ్లీ.. 50.12 సగటుతో 3,308 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్ లో అతడి అత్యుత్తమ స్కోరు 94 కాగా.. టీ20లలో కోహ్లీ 30 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక 2017-2021 వరకు భారత జట్టుకు టీ20లలో సారథిగా ఉన్న కోహ్లీ.. 50 మ్యాచ్ లలో కెప్టెన్ గా ఉండగా అందులో 30 గెలిచి 16 మ్యాచుల్లో ఓడాడు. అతడి విజయాల శాతం 64.58గా ఉంది.
ఇక టీ20లలో అత్యధిక మ్యాచ్ లు (అంతర్జాతీయ క్రికెట్ లో) ఆడిన ఆటగాళ్లలో టీమిండియా సారథి రోహిత్ శర్మ (132) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత షోయభ్ మాలిక్ (124), మార్టిన్ గప్తిల్ (121), మహ్మదుల్లా (119 - బంగ్లాదేశ్), ఇయాన్ మోర్గాన్ (115) ఉన్నారు.
టీ20లలో రోహిత్ శర్మ.. కోహ్లీ కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడినా టెస్టులు, వన్డేలలో మాత్రం హిట్ మ్యాన్ విరాట్ కంటే తక్కువ మ్యాచ్ లే ఆడాడు. రోహిత్ తన కెరీర్ లో 44 టెస్టులు, 231 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు.
ఇక వెయ్యి రోజులకు పైగా సెంచరీ లేక తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విరాట్ కోహ్లీ.. ఆదివారం పాక్ తో జరుగబోయే మ్యాచ్ లో చెలరేగుతాడో లేక పేలవ ఫామ్ ను కొనసాగిస్తాడనేది కొన్ని గంటల్లో తేలనుంది.