విరాట్ కోహ్లీకి గాయం... ఐదో టీ20లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ ఇద్దరికీ ఛాన్స్?
భారత సారథి విరాట్ కోహ్లీ, నాలుగో టీ20లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫీల్డ్ వీడి, పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ...
విరాట్ కోహ్లీ గాయం కారణంగా మైదానం వీడడంతో చివరి 8 ఓవర్లలో కెప్టెన్గా వ్యవహారించాడు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన కోహ్లీ, తన గాయం గురించి వివరణ ఇచ్చాడు...
‘ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నా కాలు బెణికినట్టు అనిపించింది. అలాగే ఫీల్డింగ్ కొనసాగిస్తే గాయం పెద్దదయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మైదానం వీడాను.. అది సరైన నిర్ణయమనే అనుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...
విరాట్ కోహ్లీ గాయపడడంతో శనివారం జరగబోయే ఆఖరి టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇద్దరూ బరిలో దిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు...
రెండో టీ20 మ్యాచ్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ఒకేసారి ఆరంగ్రేటం చేసినా, ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడలేదు. ఇషాన్ కిషన్కి బ్యాటింగ్ చేసే అవకాశం దొరకగా సూర్యకుమార్ యాదవ్కి ఛాన్స్ రాలేదు..
అయితే చెరో రెండు మ్యాచులు గెలిచి 2-2 తేడాతో సమంగా ఉన్న టీమిండియా, ఇంగ్లాండ్కి ఆఖరి మ్యాచ్ ఫైనల్గా మారింది. ఆఖరి టీ20లో గెలిచిన జట్టుకే టీ20 సిరీస్ సొంతమవుతుంది...
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఖరి టీ20 మ్యాచ్లో విరాట్ కోహ్లీ దూరమయ్యే పరిస్థితులు ఉండకపోవచ్చని, కచ్ఛితంగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి ఆడాలనే అతను భావిస్తాడని క్రికెట్ విశ్లేషకుల అంచనాలు...
ఐదు టీ20 మ్యాచుల సిరీస్లో మొదటి మూడు మ్యాచులు గెలిచి ఉంటే, ఆఖరి రెండు టీ20ల్లో విరాట్ కోహ్లీ ప్రయోగాలు చేసేవాడని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఫైనల్ టీ20లో అతను ఆడడం గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు...
ఇషాన్ కిషన్ గాయపడ్డాడని, నాలుగో టీ20కి అతన్ని దూరం పెడుతున్నట్టు చెప్పాడు విరాట్ కోహ్లీ. ఐదో టీ20 సమయానికి ఇషాన్ కిషన్ కోలుకుంటే తుది జట్టులో అతనితో పాటు సూర్యకుమార్ను ఆడించడం కష్టమవుతుంది...
వరుసగా నాలుగు టీ20ల్లో విఫలమైన కెఎల్ రాహుల్, నిన్నటి మ్యాచ్లో డబుల్ డిజిట్ స్కోరునైతే చేరుకోగలిగాడు. కాబట్టి కెఎల్ రాహుల్కి మరో అవకాశం దక్కొచ్చు...
మంచి ఫామ్లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ను, ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యాను పక్కనబెట్టలేని పరిస్థితి. దీంతో ఐదో టీ20కి జట్టు కూర్పు చాలా క్లిష్టంగా మారనుంది.