ద్రావిడ్ని దాటేసిన విరాట్ కోహ్లీ... హైదరాబాద్ టీ20లో రికార్డులు సృష్టించిన ఛేజ్ మాస్టర్...
మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్పై 71వ సెంచరీ అందుకున్నా... ఎక్కడో ఏదో అసంతృప్తి. ఆఫ్ఘాన్ వంటి పసికూనపై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఫెయిల్ అవ్వడంతో నిజంగా ఫామ్లోకి వచ్చాడా? లేక అది గాలివానలా వచ్చిన ఇన్నింగ్స్ మాత్రమేనా? అనే అనుమానాలు కూడా వినిపించాయి. అయితే హైదరాబాద్లో జరిగిన మూడో టీ20లో ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసేశాడు విరాట్ కోహ్లీ...
హైదరాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు, ఈ ఏడాది టీ20ల్లో 21వ విజయాన్ని అందుకుంది. ఒకే ఏడాదిలో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా ఆవిర్భవించింది టీమిండియా.
ఇంతకుముందు 2018లో పాకిస్తాన్ 20 టీ20ల్లో గెలవగా టీమిండియా ఆ రికార్డును తుడిచిపెట్టేసింది. 2022లో ఇంకా 3 నెలల సమయం ఉండడంతో భారత జట్టు కనీసం 10-15 టీ20 మ్యాచులు ఆడబోతుండడం విశేషం.
పూర్తి స్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మకు ఇది వరుసగా 9వ ద్వైపాక్షిక సిరీస్. అంతకుముందు తాత్కాలిక సారథిగా ఓ సిరీస్ గెలిచిన రోహిత్, వరుసగా 10 సిరీస్లు గెలిచిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు.
Suryakumar Yadav
187 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఆదుకున్నాడు విరాట్. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్కి 104 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్యకుమార్ యాదవ్ బౌండరీలతో విరుచుకుపడుతుంటే, విరాట్ కోహ్లీ సింగిల్స్ తీస్తూ అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు...
Suryakumar Yadav
27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి, జోష్ హజల్వుడ్ బౌలింగ్లో ఆరోన్ ఫించ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత స్పీడ్ పెంచిన విరాట్ కోహ్లీ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
Virat Kohli and Rohit Sharma
విరాట్ కోహ్లీకి ఇది 33వ టీ20 హాఫ్ సెంచరీ కాగా ఆస్ట్రేలియాపై 8వ హాఫ్ సెంచరీ. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక టీ20 హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...
Image Credit: Anushka Sharma Instagram
శ్రీలంకపై డేవిడ్ వార్నర్ 7 హాఫ్ సెంచరీలు బాది రెండో స్థానంలో ఉన్నాడు. ఛేజింగ్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గానూ విరాట్ కోహ్లీ టాప్లో ఉన్నాడు. ఛేజింగ్లో విరాట్కి ఇది 19వ 50+ స్కోరు కాగా, డేవిడ్ వార్నర్ 16, రోహిత్ శర్మ 12 సార్లు ఈ ఫాట్ సాధించారు.
48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్తో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు కోహ్లీ. కోహ్లీ ఖాతాలో 24072+ పరుగులు ఉండగా 24064 అంతర్జాతీయ పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్ని అధిగమించాడు విరాట్..
34357 అంతర్జాతీయ పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే విరాట్ కోహ్లీ కంటే ముందున్నాడు. అలాగే కెరీర్లో విరాట్కి ఇది 196వ 50+ స్కోరు. సచిన్ 264, రికీ పాంటింగ్ 217, కుమార సంగర్కర 216, జాక్వస్ కలీస్ 211 మాత్రమే విరాట్ కంటే ముందున్నారు...