ఒకే జట్టులో కోహ్లి, బాబర్..? మళ్లీ ప్రారంభం కాబోతున్న ఆఫ్రో-ఆసియా కప్..!
Afro-Asia Cup: ప్రపంచంలోని మేటి ఆటగాళ్ల జాబితాలో ఉన్న విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్ లు ఒకే జట్టులో ఓ మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుంది..? ఆ ఊహే అంచనాలకు అందకుండా ఉంటుంది.. అలాంటిది ఏకంగా సిరీస్ ఆడితే..?

ఆధునిక క్రికెట్ లో మేటి బ్యాటర్లైన విరాట్ కోహ్లి (ఇండియా), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) లు ఒకే జట్టులో ఆడితే ఎలా ఉంటుంది..? ఆ ఊహే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది.
టీమిండియా సారథి రోహిత్ శర్మ, పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ లు కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే ఇంకేమైనా ఉందా..? అపోజిషన్ కు బ్యాండ్ బాజా బరాతే.. ఇక జస్ప్రీత్ బుమ్రా, షహీన్ అఫ్రిది లు కలిసి బౌలింగ్ చేస్తే..? వీరికి వనిందు హసరంగ, యుజ్వేంద్ర చాహల్ కూడా కలిస్తే...? ఇక ఆ విధ్వంసం మీ ఊహకు వదిలేస్తున్నాం.
అసలు ఇవన్నీ కలలో కూడా జరగతాయా..? కలలో ఏమో గానీ వాస్తవంగా కార్యరూపం దాల్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎలా..? ఈ ప్రశ్నకు సమాధానమే ఆఫ్రో-ఆసియా కప్. టీ20, ఇతర క్రికెట్ టోర్నీల వల్ల మరుగున పడ్డ ఈ టోర్నీ మళ్లీ రాబోతుంది.
ఈ మేరకు ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బీసీసీఐ, పీసీబీ తో పాటు ఆఫ్రికా ఖండంలోని క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ తెలిపాడు.
ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘అవును. మేం దాని (ఆఫ్రోఆసియా కప్) పై చర్చిస్తున్నాం. ఈ మేరకు ఆయా బోర్డులకు ప్రతిపాదనలు పంపాం. అయితే ఇది ఇప్పటికీ పేపర్ మీదే ఉంది. కానీ మేం ఎలాగైనా దీనిని నిర్వహించాలని భావిస్తున్నాం.
ప్రపంచంలోనే మేటి జట్లుగా ఉన్న ఇండియా, పాకిస్తాన్ తో పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి టీమ్స్ కలిసి ఆడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. బోర్డుల నుంచి సమ్మతి కోసం మేం తీవ్రంగా కృషి చేస్తున్నాం. బోర్డుల నుంచి మాకు అంగీకారం వచ్చాక మేము స్పాన్సర్షిప్ తో పాటు బ్రాడ్కస్టర్ గురించి వేట సాగిస్తాం. ఇది కార్యరూపం దాల్చితే మాత్రం చాలా పెద్ద ఈవెంట్ అవుతుంది..’అని తెలిపాడు.
ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ సుమోద్ దామోదర్ స్పందిస్తూ.. ‘ఇది రెండు ఖండాల ఆటగాళ్ల మధ్య వంతెనను నిర్మించే అవకాశాన్ని చూడాలనుకుంటున్నాను. ఈ కప్ జరగాలని నేను ఆశిస్తున్నాను. రాజకీయాలను దూరంగా పెట్టి.. క్రీడాకారులు ఒక్కటి కావాలని కోరుకుంటున్నాను. ఇండియా, పాక్ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడటం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది..’ అని అన్నాడు.
మరి ఆసియా-ఆఫ్రికా కప్ జరుగుతుందా..? అనేది ఆయా దేశాల బోర్డుల మీద ఆధారపడి ఉంది. గతంలో రెండేండ్లకోసారి ఈ టోర్నీని నిర్వహించేవారు. 2005లో షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ లు కలిసి ఆసియా తరఫున ఆడారు. 2007 లో చివరిసారిగా నిర్వహించారు.