- Home
- Sports
- Cricket
- Asia Cup: మిగిలుంది రెండు వారాలే.. టికెట్లేవి..? ఇండియా-పాక్ మ్యాచ్కు ఇంకా మొదలు కాని టికెట్ కౌంటర్లు
Asia Cup: మిగిలుంది రెండు వారాలే.. టికెట్లేవి..? ఇండియా-పాక్ మ్యాచ్కు ఇంకా మొదలు కాని టికెట్ కౌంటర్లు
India vs Pakistan: టీ20 ప్రపంచకప్-2022 కంటే ముందే భారత్-పాకిస్తాన్ లు ఆసియా కప్ వేదికగా తలపడబోతున్నాయి. ఈ మెగా ఫైట్ కు ముందు దాయాదులు పాల్గొంటున్న ఈ మ్యాచ్ కు ఇప్పటికే ఫుల్ క్రేజ్ వచ్చింది.

ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభంకానున్నది. తొలి మ్యాచ్ శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య రెండో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ కంటే ముందే ఇరు దేశాల మధ్య కీలక పోరు జరుగుతుండటంతో ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఆసక్తితో ఉంటే నిర్వాహకులు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఈ టోర్నీలో హై ఓల్టేజీ మ్యాచ్ అయిన భారత్-పాక్ మ్యాచ్ కు ఇప్పటివరకు టికెట్లను విడుదల చేయలేదు.
ఆన్ లైన్ లో గానీ.. స్టేడియం ముందు గానీ అడ్వాన్స్ బుకింగ్ లను ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడంతో అభిమానులు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై దుబాయ్ లో ఉన్న ఓ భారత అభిమాని స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే ఏసీసీ తీరు నిరాశపరుస్తున్నది. క్రికెట్ ఆడే మిగిలిన దేశాలతో పోలిస్తే మాకు ఇక్కడ (యూఏఈ) జరిగేవే తక్కువ మ్యాచ్ లు. ఇక భారత్ - పాక్ మ్యాచ్ లైతే అది అరుదు. అటువంటిది ఆసియా కప్ లో భాగంగా జరిగే మ్యాచ్ చూడాలని మేం ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నాం..
టికెట్ల విషయమై నేను యూఏఈ క్రికెట్ బోర్డుతో పాటు ఏసీసీకీ మెయిల్ చేశాను. కానీ నాకు ఇంతవరకు రిప్లై లేదు. దుబాయ్ స్టేడియం ముందు టికెట్ కౌంటర్ లో అడిగినా వాళ్లు ఏం రెస్పాన్స్ అవడం లేదు. ఇది నా ఒక్కడికే కాదు. మా మిగతా స్నేహితుల పరిస్థితీ ఇంతే..’ అని అన్నాడు.
మరో అభిమాని స్పందిస్తూ.. ‘ఇండియా-పాక్ మ్యాచ్ కు ముందు టికెట్ల విషయంపై గందరగోళం నెలకొని ఉంది. మ్యాచ్ కు ఇంకా రెండు వారాలే మిగిలుంది. ఏసీసీ అధికారులు దీనిమీద ఏమీ స్పందించడం లేదు. ఈ మ్యాచ్ కు టికెట్లు దొరుకుతాయన్న ఆశలు నాకు క్రమంగా సన్నగిల్లుతున్నాయి’ అని చెప్పాడు.
ఆసియా కప్ లో ఇండియా-పాక్ మ్యాచ్ కు మరో రెండు వారాలే గడువుఉన్నా ఏసీసీ టికెట్లు పంపిణీ చేయలేదు. కానీ టీ20 ప్రపంచకప్-2022 కు మాత్రం ఇప్పటికే ఇండియా-పాక్ మ్యాచ్ టికెట్లు అమ్ముడయ్యాయి. ఆన్ లైన్ లో టికెట్ల విక్రయానికి పెట్టిన గంటలోపే టికెట్లన్నీ సేల్ అయ్యాయని ఐసీసీ తెలిపింది.