IPL 2020: ఐపీఎల్లో టాప్ వివాదాలు, గొడవలు...
2008కి ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంత సూపర్ హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. రెండు నెలల పాటు సాగే టోర్నీయే అయినా కొన్ని వేల కోట్ల ఆదాయానికి అద్భుతమైన మార్గంగా మారింది ఐపీఎల్. అయితే ఈ టోర్నీలో వివాదాలు, గొడవలు కూడా భాగమయ్యాయి. ఇప్పటిదాకా జరిగిన కొన్ని టాప్ వివాదాలు, గొడవలు ఇవి.
స్పాట్ ఫిక్సింగ్ కేసు: 2012లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు పెను సంచలనం రేపింది. స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడిన ఐదుగురు ప్లేయర్లను ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేశారు. డెక్కన్ ఛార్జర్స్ ప్లేయర్ టీవీ సుధీంద్ర, పూణే ప్లేయర్ మోనిశ్ మిశ్రా, పంజాబ్ ప్లేయర్లు అమిత్ యాదవ్, సలబ్ శ్రీవాస్తవ, ఢిల్లీ ప్లేయర్ అభినవ్ బాలి ఈ స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడినట్టు ఒప్పుకున్నారు.
2013 శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కేసు: 2013లో రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు ప్లేయర్లు స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. భారత క్రికెటర్ శ్రీశాంత్తో పాటు అంకిత్ ఛావన్, అజిత్ చంఢీలాలపై సస్పెండ్ వేటు వేసింది బీసీసీఐ.
శ్రీశాంత్ను కొట్టిన భజ్జీ: 2008 సీజన్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హర్భజన్ సింగ్, శ్రీశాంత్పై చేయి చేసుకున్నాడు. శ్రీశాంత్ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం టీవీల్లో కనిపించింది. అయితే భజ్జీ, శ్రీశాంత్ను కొట్టిన ఫుటేజీ మాత్రం ఇప్పటిదాకా బయటపెట్టలేదు బీసీసీఐ.
గంభీర్, కోహ్లీ ఫైట్: 2013 సీజన్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. కోహ్లీ అవుటైన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్న కోల్కత్తా ప్లేయర్లపై నోరుపారేసుకున్నాడు విరాట్. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి గంభీర్, కోహ్లీ కొట్టుకుంటారేమోననే రేంజ్కి వెళ్లింది.
అంబటి రాయుడు, హర్భజన్ సింగ్: ఒకే జట్టుకు ఆడిన ఈ ఇద్దరి మధ్య ఫీల్డింగ్ ప్లేస్ గురించి గొడవ జరిగింది. ఫూణె బ్యాట్స్మెన్ కొట్టిన బంతిని భజ్జీ మిస్ చేయడంతో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రాయుడు దాన్ని ఆపేందుకు చివరిదాకా ప్రయత్నించాడు. కానీ వీలు కాలేదు. దీంతో ఆవేశానికి లోనైన రాయుడు, భజ్జీపై అరిచాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.
క్రీజులోకి వచ్చిన ధోనీ: మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్లు మినహా, ఎవ్వరూ క్రీజులోకి అడుగు పెట్టకూడదు. అయితే గత సీజన్లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అంపైర్ మొదట నో బాల్ ఇచ్చి, తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడంతో ఆశ్చర్యానికి లోనైన ధోనీ... క్రీజులోకి వెళ్లిపోయాడు. అంపైర్లతో వాగ్వాదానికి దిగి, మళ్లీ పెవిలియన్కి వచ్చాడు. ‘మిస్టర్ కూల్’గా పేరొందిన ధోనీ ఇలా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
పోలార్డు మూతికి టేప్: 2015 సీజన్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కిరన్ పోలార్డ్ సెడ్జింగ్కి దిగాడు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఫిర్యాదుతో అంపైర్లు పోలార్డుకి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మూతికి ప్లాస్టిక్ టేపు వేసుకున్న పోలార్డ్, ఓ ఓవర్ మొత్తం మాట్లాడకుండా అందర్నీ నవ్వించాడు.
అశ్విన్ మన్కడింగ్ వివాదం: రాజస్థాన్తో జరిగిన మ్యాచులో 69 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న జోస్ బట్లర్ను మన్కడింగ్ పద్ధతి ద్వారా రనౌట్ చేశాడు పంజాబ్ కెప్టెన్ అశ్విన్. క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా రవిచంద్రన్ అశ్విన్ వ్యవహారించడని, అతనిపై ఇప్పటికీ ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి.