టీమిండియా ‘రనౌట్’... భారత జట్టు కొంపముంచిన మూడు రనౌట్లు... ఆసీస్కి...
వన్డే, టీ20ల్లో బ్యాట్స్మెన్ రనౌట్ అవ్వడం చాలా సాధారణ విషయం. అయితే ఎంతో ఓపిగ్గా ఆడాల్సిన టెస్టు క్రికెట్లో కూడా ముగ్గురు బ్యాట్స్మెన్ రనౌట్ అయ్యారంటే? సిడ్నీ టెస్టులో భారత క్రికెటర్ల ఆత్రానికి నిదర్శనం ఇది. లేని పరుగు కోసం ప్రయత్నించి విహారి, వికెట్ల మధ్య నెమ్మదిగా పరుగెత్తి రవిచంద్రన్ అశ్విన్... రెండో పరుగు కోసం వెళ్లి బుమ్రా రనౌట్ అయ్యారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియాకి 94 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
భారత ఇన్నింగ్స్లో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా రనౌట్ల రూపంలో పెవిలియన్ చేరి, 12 ఏళ్ల నాటి టీమిండియా చెత్త రికార్డును సమం చేశారు.
భారత ఇన్నింగ్స్లో శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీలు నమోదుచేశారు. ఇద్దరూ కూడా 50 పరుగుల వద్దే పెవిలియన్ చేరడం విశేషం.
ఒకే టెస్టు ఒకే ఇన్నింగ్స్లో 50 పరుగుల వద్ద ఇద్దరు భారత బ్యాట్స్మెన్ అవుట్ కావడం ఇదే తొలిసారి...
రోహిత్ శర్మ 26 పరుగులు చేసి అవుట్ కాగా అజింకా రహానే 22 పరుగులు చేశాడు..
4 పరుగులు చేసిన హనుమ విహారి, 10 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, పరుగులేమీ చేయకుండానే బుమ్రా... రనౌట్ల రూపంలో పెవిలియన్ చేరారు.
రవీంద్ర జడేజా 37 బంతుల్లో 28 పరుగులు చేయగా సిరాజ్ 6 పరుగులు చేసి ఆఖరి వికెట్గా పెవిలియన్ చేరాడు.
సిరాజ్తో కలిసి ఆఖరి వికెట్కి 28 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రవీంద్ర జడేజా. ఫలితంగా ఆసీస్ ఆధిక్యాన్ని 100 లోపు తగ్గించగలిగాడు.
ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు భారత బ్యాట్స్మెన్ రనౌట్ కావడం ఇది ఏడోసారి కాగా... తొలి ఇన్నింగ్స్లో ఇలా జరగడం తొలిసారి... చివరిగా 2008లో ఇంగ్లాండ్పై సెహ్వాగ్, లక్ష్మణ్, యువరాజ్ ఒకే ఇన్నింగ్స్లో రనౌట్ అయ్యారు.
రిషబ్ పంత్ 36 పరుగులు చేసి హజల్ వుడ్ బౌలింగ్లో అవుట్ కాగా నవ్దీప్ సైనీ 3 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు...
మొదటి టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రెండో టెస్టులో అజింకా రహానే రనౌట్ రూపంలో అవుటైన సంగతి తెలిసిందే. మూడో టెస్టుతో కలిపి ఒకే టెస్టు సిరీస్లో ఐదుగురు భారత బ్యాట్స్మెన్ రనౌట్ అయ్యారు...
భారత బ్యాట్స్మెన్ రనౌట్ అయిన సందర్భాల్లో మూడు సార్లు నాన్-స్టైయికింగ్లో రవీంద్ర జడేజా ఉండడం విశేషం.
ఇంతకుముందు 1990 పాకిస్తాన్ పర్యటనలో ఈ విధంగా రనౌట్ అయ్యింది టీమిండియా. సచిన్ ఆరంగ్రేటం చేసిన ఈ సిరీస్లో ఎనిమిది మంది బ్యాట్స్మెన్ రనౌట్ అయ్యారు...
ముగ్గురు బ్యాట్స్మెన్ పది, అంతకంటే తక్కువ పరుగులకే రనౌట్ కావడం టీమిండియా టెస్టు చరిత్రలోనే ఇది తొలిసారి. నేటి ఇన్నింగ్స్లో అశ్విన్ 10, విహారి 4, బుమ్రా డకౌట్ అయ్యారు.
ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ 4 వికెట్లు తీయగా హజల్వుడ్ 2, స్టార్క్ ఓ వికెట్ తీశారు.