- Home
- Sports
- Cricket
- ఇది మాకు డూ ఆర్ డై.. ఆ తప్పులు మళ్లీ చేయం : పంజాబ్ తో కీలక మ్యాచ్ కు ముందు ఢిల్లీ స్పిన్నర్ కామెంట్స్
ఇది మాకు డూ ఆర్ డై.. ఆ తప్పులు మళ్లీ చేయం : పంజాబ్ తో కీలక మ్యాచ్ కు ముందు ఢిల్లీ స్పిన్నర్ కామెంట్స్
IPL 2022 PBKS vs DC: ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నేటిరాత్రి ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్ ను ఢీకొంటున్నది. ఈ నేపథ్యంలో ఆ జట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పంజాబ్ కింగ్స్ తో నేటి రాత్రి కీలక మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది తమకు డూ ఆర్ డై వంటి పరిస్థితి అని, ఈ మ్యాచ్ లో గెలిస్తేనే తమకు సీజన్ లో ముందుకెళ్లే అవకాశాలుంటాయని తెలిపాడు.
పంజాబ్ తో మ్యాచ్ కు ముందు కుల్దీప్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది మాకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ సీజన్ లో మేము బాగా ఆడాం. అయితే కొన్ని మ్యాచుల్లో విజయానికి దగ్గరగా వచ్చి కూడా పలు తప్పుల వల్ల వాటిని కోల్పోయాం.
ఆ మ్యాచ్ లలో చేసిన తప్పులను మేము రాబోయే గేమ్ లలో పునరావృతం చేయాలనుకోవడం లేదు. అలా అయితేనే మేం నిలిచే అవకాశాలుంటాయి. ఇక పంజాబ్ తో మ్యాచ్ కోసం మేము బాగా సిద్ధమయ్యాం..
ఈ మ్యాచ్ ను మేము నాకౌట్ మ్యాచ్ లాగా భావిస్తున్నాం. ఈ మ్యాచ్ లో ముందు బౌలింగ్ చేయడానికైనా.. బ్యాటింగ్ చేయడానికైనా మేము సిద్ధపడే ఉన్నాం. అయితే మేం బౌలింగ్ చేసినా బ్యాటింగ్ చేసినా మాకు మంచి ఆరంభాలు దక్కాలి. వాటితో పాటు పిచ్ పరిస్థితులను కూడా మేం అంచనా వేసుకోవాలి..
పంజాబ్ కింగ్స్ మంచి జట్టు. వాళ్ల జట్టులో చాలా మంచి ప్లేయర్లున్నారు. ఆర్సీబీతో వాళ్లు ఆడిన గత మ్యాచ్ లో ఆ జట్టు ఎలా ఆడిందో అందరికీ తెలిసిందే.
టీ20 లలో వీక్ టీమ్ అంటూ ఏదీ ఉండదు. వారిదైన రోజున ఏ జట్టైనా భారీ స్కోరు చేయగలదు.. బౌలింగ్ లో కూడా రాణించి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయగలుగుతుంది...’ అని తెలిపాడు.
ఇదిలాఉండగా.. పాయింట్ల పట్టికలో ఐదు, ఏడు స్థానాలలో ఉన్న ఈ జట్టు తలా 12 పాయింట్లతో ఉన్నాయి. ప్లేఆఫ్ కు వెళ్లేందుకు ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ తో పాటు తర్వాత ఆడబోయే మ్యాచ్ కూడా కీలకమే. రెండింటిలో గెలిస్తేనే ఈ జట్లకు ప్లేఆఫ్ కు ఆర్సీబీతో పోటీ పడొచ్చు. కానీ ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు.. ఇక బ్యాగ్ సర్దుకోవడమే.