- Home
- Sports
- Cricket
- బుమ్రా లేకున్నా పర్లేదు.. ముంబైకి అతడున్నాడుగా.. టాప్ -3లో ప్లేస్ పక్కా అంటున్న గవాస్కర్
బుమ్రా లేకున్నా పర్లేదు.. ముంబైకి అతడున్నాడుగా.. టాప్ -3లో ప్లేస్ పక్కా అంటున్న గవాస్కర్
IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కీలక బౌలర్లు లేకపోవడంతో అసలు ఆ జట్టు ఏ మేరకు రాణించగలుగుతుందనేది అభిమానులను వేధిస్తున్న ప్రశ్న..

2023 ఐపీఎల్ ఎడిషన్ కు త్వరలో తెరలేవనుంది. గతేడాది దారుణ వైఫల్యాలతో పాయింట్ల పట్టికలో చివర నిలిచిన ముంబై.. ఈసారి తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నది. ఒక సీజన్ లో రాణించకపోయినా తర్వాత మళ్లీ టైటిల్ నిలబెట్టుకోవడం ఆ జట్టుకు అలవాటే. అయితే ఈ ఏడాది పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవు.
ముంబై జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఈ ఎడిషన్ లో ఆడటం లేదు. వెన్ను గాయం కారణంగా బుమ్రా ఇటీవలే సర్జరీ చేయించుకున్నాడు. అతడు న్యూజిలాండ్ లోనే ఉన్నాడు. మరో ఆరు నెలల పాటు బుమ్రా క్రికెట్ ఆడేది అనుమానమే. ఇది ముంబై ఇండియన్స్ కు కోలుకోలేని షాక్.
బుమ్రాతో పాటు ఆస్ట్రేలియా పేసర్ జై రిచర్డ్సన్ కూడా ఈ సీజన్ లో ముంబైకి షాకిచ్చాడు. జనవరిలో మోచేతి గాయం కారణంగా అతడు కూడా ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతడు కూడా ఈ సీజన్ కు దూరమయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ కు ప్రధాన ఫాస్ట్ బౌలర్లు కరువయ్యారు.
అయితే కీలక ఆటగాళ్లు లేకున్నా ముంబై జట్టు ఈసారి మెరుగైన ప్రదర్శనలతో టాప్-3లో ఒక జట్టుగా ఉంటుందని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా, రిచర్డ్సన్ లేకున్నా జోఫ్రా ఆర్చర్ , కామెరూన్ గ్రీన్ వంటి ఆటగాళ్లు ఆ జట్టు సొంతమని.. తద్వారా ముంబై అద్భుతాలు చేయగలదని సన్నీ తెలిపాడు.
స్టార్ స్పోర్ట్స్ తో జరిగిన చర్చా కార్యక్రమంలో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘వాళ్లు (ముంబై ఇండియన్స్) గతేడాది వైఫల్యాలను ఎంత త్వరగా మరిచిపోతే అంత మంచిది. తాము మళ్లీ పుంజుకోగలమన్న నమ్మకంతో వాళ్లు ఈ సీజన్ లో బరిలోకి దిగాలి.
ఈ సీజన్ లో ముంబై బుమ్రా సేవలను కోల్పోనుంది. కానీ కీలక ఆటగాళ్లు లేకున్నా ఆ జట్టుకు మళ్లీ ఛాంపియన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ టీమ్ లో జోఫ్రా ఆర్చర్, గ్రీన్ వంటి ఛాంపియన్ ప్లేయర్లున్నారు. ఈ సీజన్ లో ముంబై కచ్చితంగా టాప్-3లో ఉంటుందని నేను భావిస్తున్నా..’అని చెప్పాడు.