ఇండియాకు టెస్టుల కంటే ఐపీఎలే ముఖ్యం.. ఇది క్రికెట్ కు చాలా ప్రమాదకరం : ఇంగ్లాండ్ మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్
IPL: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అంతర్జాతీయ టెస్టు మ్యాచుల కంటే ధనార్జనే ధ్యేయమని ఇంగ్లాండ్ మాజీ పేసర్ పాల్ న్యూమన్ ఆరోపించాడు. ఇది చాలా ప్రమాదకరమని అతడు వ్యాఖ్యానించాడు.
గతేడాది ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు వచ్చి కోవిడ్ కారణంగా అర్థాంతరంగా సిరీస్ ను రద్దు చేసుకున్నాయి ఇండియా-ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు. ఐదో టెస్టుకు ముందు టీమిండియా కోచింగ్ సిబ్బంది మొత్తం కరోనా బారిన పడటంతో మ్యాచ్ ను వాయిదావేశారు.
అదే మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసి జులై 1 నుంచి ఆడించనున్నాయి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు. అయితే సిరీస్ ను అర్థాంతరంగా వాయిదా వేసుకున్న టీమిండియా.. ఆ వెంటనే దుబాయ్ వెళ్లి అక్కడ ఐపీఎల్ తో పాటు టీ20 ప్రపంచకప్ కూడా ఆడింది. ఇప్పుడిదే విషయమై ఇంగ్లాండ్ మాజీ పేసర్ పాల్ న్యూమన్ టీమిండియాపై ఆరోపణల వర్షం కురిపించాడు.
ఎడ్జబాస్టన్ వేదికగా ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ కు ముందు పాల్ న్యూమన్ మాట్లాడుతూ.. బీసీసీఐకి అంతర్జాతీయ టెస్టు మ్యాచుల కంటే ఐపీఎలే ముఖ్యమని.. కోవిడ్ కారణంగా గతేడాది టెస్టు మ్యాచ్ ను రద్దు చేశామనడం హాస్యాస్పదమని అన్నాడు. బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశాడు.
న్యూమన్ స్పందిస్తూ.. ‘టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ కు వచ్చిన టీమిండియా గతేడాదే దీనిని ఓల్డ్ ట్రఫోర్డ్ (గతేడాది చివరి టెస్టు జరగాల్సిన వేదిక) లోనే దీనిని ముగించాల్సింది. కానీ వాళ్లు ఆ మ్యాచ్ ను రద్దు చేయించుకుని స్టేడియానికి మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులను నిరాశపరిచారు.
ఇక కోవిడ్ కారణంగా మ్యాచ్ ను ర్దుదు చేశామనడం హస్యాస్పదం. మరి ఆ తర్వాతైనా వాళ్లు ఐపీఎల్ వైపునకే మొగ్గు చూపారే తప్ప టెస్టు పూర్తి చేయలేదు. ఇలాంటి దృక్పథం ఉండటం ప్రమాదకరం...’అని యూకేకు చెందిన డైలీ మెయిల్ కు రాసిన ఆర్టికల్ లో పేర్కొన్నాడు.
ఇదే విషయమై గతంలో ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గతేడాది సెప్టెంబర్ 11న వాన్ ట్వీట్ చేస్తూ ‘ఐపీఎల్ జట్లు చార్టర్ ప్లేన్లలో తిరుగుతున్నాయి. యూఏఈలో ఆరు రోజుల క్వారంటైన్ ఉంది. టోర్నీ ప్రారంభమయ్యేవరకు మరో 7 రోజుల సమయముంది. ఐపీఎల్ తప్ప మరే ఇతర కారణాల వల్ల ఈ టెస్టు రద్దైందని నాకు చెప్పకండి..’ అని ట్వీట్ చేశాడు.