ఆ ముగ్గురినీ తీసి పక్కనబెట్టండి, వారి వల్ల జట్టుకి ఎలాంటి ఉపయోగం లేదు... టీమిండియా పర్ఫామెన్స్తో...
లార్డ్స్ టెస్టులో ఫాస్ట్ బౌలర్ల పర్ఫామెన్స్ కారణంగా అద్భుత విజయం అందుకుంది టీమిండియా. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ బాల్తోనూ, బ్యాటుతోనూ రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆ విజయం ఇచ్చిన ఉత్సాహం... తర్వాతి మ్యాచ్కే మాయమైంది...
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 78 పరుగులకే కుప్పకూలి, చెత్త రికార్డు మూటకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్లలో ఎవ్వరూ 20 పరుగుల స్కోరు కూడా చేయలేకపోయారు...
టీమిండియా చరిత్రలో భారత బ్యాట్స్మెన్ ఎవ్వరూ 20 పరుగుల మార్కు అందుకోలేకపోవడం ఇదే తొలిసారి. ఓవరాల్గా టీమిండియాకి ఇది 9వ లోయెస్ట్ స్కోరు కాగా ఇంగ్లాండ్లో మూడో అత్యల్ప స్కోరు...
1974లో లార్డ్స్లో 42 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా, 1952లో మాంచెస్టర్లో 58 పరుగులు చేసింది. ఆ తర్వాత లోయెస్ట్ స్కోరు ఇదే... విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకి ఇదే అత్యల్ప స్కోరు...
అయితే ఈ పర్ఫామెన్స్తో భారత మిడిల్ ఆర్డర్ వైఫల్యం మరోసారి స్పష్టంగా కనిపించింది. తొలి రెండు టెస్టుల్లో ఓపెనర్లు, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బ్యాటుతో రాణించడం, బౌలర్లు అదరగొట్టడంతో ఆధిక్యం కనబర్చింది టీమిండియా...
కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోవడంతో మొదలైన వికెట్ల పతనం... ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా... ఇలా టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అందరూ పెవిలియన్కి క్యూ కట్టేదాకా సాగింది...
గత మ్యాచ్లో బ్యాటుతో ఆదుకున్న భారత టెయిలెండర్లకు కుదురుకునే సమయం కూడా ఇవ్వకుండా వరుస బంతుల్లో వారిని పెవిలియన్ చేర్చారు ఇంగ్లాండ్ బౌలర్లు. రోహిత్ శర్మ అవుటైన తర్వాతి బంతికే షమీ అవుట్ కాగా, జడేజా అవుటైన తర్వాతి బంతికే బుమ్రా డకౌట్ అయ్యాడు..
ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే... ఈ ముగ్గురూ అవుటైన విధానమై ఇక్కడ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ ముగ్గురూ కూడా వరుసగా గుడ్ లెంగ్త్ బంతులను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతూ, ఎడ్జ్ క్యాచులతో వికెట్లు సమర్పించుకుంటున్నారు...
విరాట్ కోహ్లీ వరుసగా ఇలాగే అవుట్ అవుతున్నా, తన టెక్నిక్ మార్చుకునే విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపించినట్టు కనిపించడం లేదు. ఫామ్లో లేని పూజారా బ్యాటింగ్లో కూడా ఇదే లోపం కనబడుతోంది...
వరుసగా విఫలం అవుతున్న విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారాలను తీసి పక్కనబెట్టాలని, వారి స్థానంలో హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
అలాగే అజింకా రహానే 18 పరుగులు చేసి, రోహిత్ శర్మ తర్వాత టాప్ స్కోరర్గా నిలిచినా.. కీలక భాగస్వామ్యం నిర్మిస్తున్న సమయంలో అవుటై టీమిండియాను కష్టాల్లోకి నెట్టేశాడు. రహానే అవుటైన తర్వాత మరిన్ని కష్టాల్లోకి వెళ్లిన టీమిండియా... రిషబ్ పంత్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయి,78 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
67 పరుగుల వద్దే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు, సిరాజ్ 3, ఇషాంత్ శర్మ 8 పరుగులు చేసి 11 పరుగులు సమకూర్చడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది...
సీనియర్లు వరుసగా విఫలం అవుతున్నా, తమ టెక్నిన్ను మార్చుకోవడం లేదంటే... వాళ్లు వాటిపై ఫోకస్ పెట్టడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
మిడిల్ ఆర్డర్లో పరుగులు రాకపోయినా, విజయాలు వస్తున్నాయనే ఉద్దేశంతో విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించింది టీమిండియా. అయితే మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మొదటి రెండు సెషన్లలో టీమిండియా పర్ఫామెన్స్, జట్టులో ఎలాంటి మార్పులు అవసరమో స్పష్టంగా కళ్లకు కట్టినట్టు చూపించింది...
ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే బౌలర్లు అద్భుతం చేయాలి... లేదా రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ అసాధారణంగా రాణించాలి. తొలి ఇన్నింగ్స్ పర్ఫామెన్స్ చూసిన తర్వాత ఈ రెండూ ఆశించడం అత్యాశే అవుతుంది...
ఆడిలైడ్ టెస్టు తర్వాత టీమిండియాలో మార్పులు జరిగినట్టుగా... లీడ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ పర్ఫామెన్స్, మిగిలిన రెండు టెస్టుల్లో జరగబోయే మార్పులను నిర్ణయించనుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.