రెండో టీ20లో ఈ ప్లేయర్లు మిస్... లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న దేవ్దత్ పడిక్కల్...
ఎన్నో రోజులుగా తుదిజట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్న యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ దేవ్దత్ పడిక్కల్, లక్కీ ఛాన్స్ను మిస్ చేసుకున్నాడు. కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్నవారిలో దేవ్దత్ పడిక్కల్ ఉండడంతో లంక టూర్లో మిగిలిన రెండు టీ20 మ్యాచుల్లో అతను ఆడడం లేదు.
శ్రీలంక టూర్లో ఉన్న భారత ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నిర్వహించిన పరీక్షల్లో కృనాల్కి పాజిటివ్ రావడంతో రెండో టీ20 మ్యాచ్ను జూలై 28కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు...
కరోనా పాజిటివ్గా తేలిన కృనాల్ పాండ్యాకి జ్వరం లేదు, స్వల్పంగా గొంతు నొప్పితో పాటు కొద్దిగా ఒళ్లునొప్పులతో బాధపడుతున్నట్టు తేల్చారు వైద్యులు... అతన్ని ఐసోలేషన్కి తరలించారు.
కృనాల్ పాండ్యాతో పాటు అతనితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న 8 మంది క్రికెటర్లను కూడా ఐసోలేషన్కి తరలిస్తున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా... దీంతో ఈ ప్లేయర్లు లంకతో జరిగే రెండో, మూడో టీ20 మ్యాచుల్లో ఆడడం లేదు.
పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, దేవ్దత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్లతో పాటు మరో ఇద్దరు ప్లేయర్లు, కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. వీరికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది.
అయినప్పటికీ కరోనా ప్రోటోకాల్ ప్రకారం తప్పనిసరిగా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది... దీంతో రెండు, మూడో టీ20 మ్యాచుల్లో స్టార్లు లేకుండా బరిలో దిగనుంది భారత జట్టు.
శ్రీలంక టూర్కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీశ్ రాణా... అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసేశారు... దేవ్దత్ పడిక్కల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే లంక టూర్కి ఎంపికై అంతర్జాతీయ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నవారిలో ఉన్నారు.
కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్నవారిలో దేవ్దత్ పడిక్కల్ ఉండడంతో ఓ లక్కీ ఛాన్స్ను కోల్పోయాడు. రుతురాజ్ గైక్వాడ్ మాత్రం నేటి మ్యాచ్లో ఓపెనింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నితీశ్ రాణా, మనీశ్ పాండే వంటి ప్లేయర్లకు కూడా అవకాశం దక్కొచ్చు.
వన్డే సిరీస్లో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిన సీనియర బ్యాట్స్మెన్ మనీశ్ పాండేకి కూడా మరో లక్కీ ఛాన్స్ దొరకవచ్చు... మనీశ్ పాండే తుదిజట్టులో ఉన్న గత 14 టీ20 మ్యాచుల్లో భారత జట్టు ఓడిపోయింది లేదు. పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా, టీ20ల్లో లక్కీ ప్లేయర్గా మారిన మనీశ్ పాండే, రెండో టీ20లో చోటు దక్కించుకుంటాడో లేక మరో యంగ్ ప్లేయర్కి ఛాన్స్ వస్తుందో చూడాలి.
లంకతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత జూలై 30న ఇంగ్లాండ్ ఫ్లైయిట్ ఎక్కాల్సిన పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్లపై మాత్రం కృనాల్ పాండ్యా పాజిటివ్ ఎఫెక్ట్ పడింది. కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వారిలో ఉన్న ఈ ఇద్దరూ, క్వారంటైన్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్కి వెళ్లనున్నారు.
వాస్తవానికి బయో బబుల్ ట్రాన్స్ఫర్ ద్వారా లంక టూర్ నుంచి నేరుగా ఇంగ్లాండ్లోని భారత జట్టుతో కలవాలని అనుకున్నారు పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్. అయితే కృనాల్ పాండ్యా పాజిటివ్ రిజల్ట్ కారణంగా ఇంగ్లాండ్లోనూ ఈ ఇద్దరూ 14 రోజుల క్వారంటైన్ పీరియడ్లో గడపబోతున్నారు.