గబ్బా టెస్టుకి రికార్డు వ్యూయర్షిప్... ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టును ఎంత మంది వీక్షించారంటే...
అత్యధిక మంది వీక్షించిన టెస్టు సిరీస్ భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ...
ఆఖరి టెస్టుకి రికార్డు లెవల్ వ్యూయర్షిప్... సబ్స్క్రిప్షన్ తీసుకుని అత్యధికమంది వీక్షించిన టెస్టుగానూ గబ్బా టెస్టు రికార్డు...
టీ20లతో పోలిస్తే, వన్డేలకు... వన్డేలతో పోలిస్తే టెస్టులను వీక్షించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
ఐదు రోజుల పాటు టిక్కు టిక్కు మంటూ సాగే టెస్టులకు ఈ మధ్యకాలంలో పెద్దగా ఆదరణ లభించడం లేదనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.
అయితే ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు దీన్ని తిరగరాసింది. మొదటి టెస్టులో ఘోర వైఫల్యం తర్వాత రెండో టెస్టులో భారత జట్టు ఇచ్చిన కమ్బ్యాక్ చూసి ఆశ్చర్యపోయిన జనాలు, సిడ్నీ టెస్టును ఆసక్తిగా చూశారు.
మూడో టెస్టు ఐదో రోజు నొప్పిని భరిస్తూ హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ ఆడిన డిఫెన్స్... జనాలకు విపరీతంగా నచ్చేసింది.
ఆ తర్వాత ఆస్ట్రేలియాకి మూడు దశాబ్దాలుగా తిరుగులేని రికార్డు ఉన్న గబ్బాలో జరిగిన నాలుగో టెస్టుకి రికార్డు లెవల్ వ్యూయర్షిప్ వచ్చిందట.
ఆసీస్ మీడియా సంస్థ ఫాక్స్టెల్ వివరాల ప్రకారం... ‘ఆస్ట్రేలియాలో సబ్స్క్రిప్షన్ తీసుకుని అత్యధిక మంది వీక్షించిన టెస్టు సిరీస్ భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీసే...
2018-19లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కంటే, ఈసారి టెస్టు సిరీస్కి 54 శాతం వ్యూయర్షిప్ ఎక్కువ వచ్చింది.
ఆస్ట్రేలియాలో మంచి క్రేజ్ ఉన్న యాషెస్ సిరీస్ కంటే ఇది చాలా ఎక్కువ’...
గబ్బా టెస్టు ఐదో రోజున సగటున 4 లక్షల మంది వీక్షించారట. మొత్తంగా గబ్బా టెస్టు వ్యూయర్షిప్ సగటు 3,41,000.
ఆస్ట్రేలియాలో ఇదే అత్యధికం. ఆఖరి రోజు చివరి ఓవర్ల దాకా మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడమే దీనికి ప్రధానకారణం... క్రికెట్ ఆస్ట్రేలియా కూడా చారిత్రాత్మకమైన టెస్టు సిరీస్ ఆడినందుకు టీమిండియాకు ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. ‘వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్టు సిరీస్’గా బోర్డర్ గవాస్కర్ టోర్నీ 2020-21ని అభివర్ణించింది క్రికెట్ ఆస్ట్రేలియా.