- Home
- Sports
- Cricket
- గబ్బాలో గెలవాలంటే మళ్లీ టీమిండియానే రావాలి... ఇంగ్లాండ్ టీమ్కి మెంటర్గా రిషబ్ పంత్...
గబ్బాలో గెలవాలంటే మళ్లీ టీమిండియానే రావాలి... ఇంగ్లాండ్ టీమ్కి మెంటర్గా రిషబ్ పంత్...
గబ్బా... ఆస్ట్రేలియాకి తిరుగులేని అడ్డా. ఆ ఆధిక్యాన్ని నిలుపుకుంటూ యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి, 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది ఆస్ట్రేలియా. ఈ విజయం తర్వాత ట్రెండింగ్లో టీమిండియా పేరు, రిషబ్ పంత్ పేరు కనిపించడం విశేషం...

33 ఏళ్లుగా బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టు టెస్టు మ్యాచ్ ఓడింది లేదు. అందుకే సిడ్నీ టెస్టు జరుగుతున్న సమయంలో క్రీజులో పాతుకుపోయిన రవిచంద్రన్ అశ్విన్తో ‘గబ్బాలో ఎలా ఆడతారో చూస్తా’ అంటూ సెడ్జ్ చేశాడు అప్పటి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్..
‘వచ్చే ఏడాది ఇండియాకి వస్తావ్ కదా... అదే నీకు ఆఖరి టూర్ అవుతుంది... నేను చూస్తా...’ అంటూ టిమ్ పైన్కి రవిచంద్రన్ అశ్విన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు...
‘గబ్బాలో చూసుకుందాం’ అని టీమిండియాకి సవాల్ విసిరింది ఆస్ట్రేలియా జట్టు. అయితే 33 ఏళ్లుగా ఆసీస్కి కంచుకోటగా మారిన గబ్బాలో భారత జట్టు చేతుల్లో ఘోర పరాభవం ఎదురవుతుందని ఆసీస్ కాదు కదా, ఏ క్రికెట్ విశ్లేషకులూ అంచనా వేయలేకపోయారు...
అయితే భారత జట్టు అంచనాలకు మించి ఆటతీరుతో గబ్బాలో ‘ఆసీస్ను అబ్బా అనిపించే రేంజ్లో దెబ్బ తీసి... ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికీ గబ్బా అనగానే గుర్తొచ్చే మ్యాచ్ అదే...
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లబుషేన్ 108 పరుగులు చేయగా, కెప్టెన్ టిమ్ పైన్ 50 పరుగులు చేశాడు...
ఆస్ట్రేలియా బౌలర్ల విజృంభనతో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి, కష్టాల్లో పడింది టీమిండియా. ఈ దశలో శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఏడో వికెట్కి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో మెరవడంతో టీమిండియా 336 పరుగులకి ఆలౌట్ అయ్యింది...
ఆస్ట్రేలియాకి తొలి ఇన్నింగ్స్లో 33 పరుగుల ఆధిక్యం దక్కింది. మహ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 294 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత జట్టు ముందు 328 పరుగుల టార్గెట్ పెట్టింది. గబ్బాలో అదీ ఐదో రోజు 328 పరుగులు చేయడమంటే మామూలు విషయం కాదు...
అదీకాకుండా విరాట్ కోహ్లీ లేడు, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ గాయపడి ఈ మ్యాచ్లో బరిలో దిగలేదు. అయితే యువ భారత జట్టు, ఆఖరి రోజు అద్భుతమై చేసింది. రోహిత్ శర్మ 7 పరుగులకే అవుటైనా శుబ్మన్ గిల్ 146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు...
211 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా గాయాలను భరిస్తూ, వికెట్లకు అడ్డుగా శరీరాన్ని ఉంచి ఆసీస్ ఫాస్ట్ బౌలర్లతో వీరోచిత పోరాటం చేశాడు. పూజారా ఇన్నింగ్స్లో దాదాపు 12 బంతులు, అతని శరీరానికి బలంగా తాకాయి...
కెప్టెన్ అజింకా రహానే 22 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 24 పరుగులు, వాసింగ్టన్ సుందర్ 29 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 22 పరుగులు, మయాంక్ అగర్వాల్ 9 పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ 2 పరుగులు చేశాడు...
ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్లో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో ఈజీగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు రిషబ్ పంత్. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో పంత్ కొట్టిన రివర్క్ స్వీప్ ఫోర్, ఈ మ్యాచ్కే హైలైట్...
పరుగులు వస్తున్నా, సమయం కూడా అయిపోవస్తుండడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమోనని అనుకున్నారంతా. అయితే గేర్ మార్చి, బౌండరీలతో విరుచుకుపడిన రిషబ్ పంత్, కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్తో మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించాడు...
138 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 89 పరుగులు చేసిన రిషబ్ పంత్, గబ్బాలో ఆస్ట్రేలియాకు 33 ఏళ్ల తర్వాత పరాజయాన్ని రుచి చూపించాడు... అంతకుముందు, ఆ తర్వాత సెంచరీలు చేసినా, సిడ్నీ టెస్టులో 91 పరుగులతో ఆకట్టుకున్నా, గబ్బా టెస్టు ఇన్నింగ్స్ మాత్రం పంత్ కెరీర్లో చాలా స్పెషల్.
ఆస్ట్రేలియాను గబ్బాలో ఓడించాలంటే, మళ్లీ ఇండియా జట్టే రావాలని... ఇంగ్లాండ్ను ట్రోల్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. గబ్బాలో ఆస్ట్రేలియా బౌలర్లను ఎలా ఎదుర్కొవాలో రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారాలను అడిగి తెలుసుకోవాలంటూ విమర్శలు చేస్తున్నారు...
ఇక మిగిలిన మ్యాచుల్లో అయినా ఆసీస్ను ఓడించాలంటే రిషబ్ పంత్ను మెంటర్గా రావాలని కోరితే బెటర్ అంటూ ఇంగ్లాండ్ టీమ్పై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వరుసగా ఏడు టెస్టులు గెలిచి, యాషెస్ సిరీస్కి వెళ్తామని కామెంట్ చేసిన జో రూట్... అదీ చేయలేక, ఆసీస్ను ఓడించలేకపోయాడని ట్రోల్స్ వస్తున్నాయి.