ఐపీఎల్లో తెలుగు ప్లేయర్లకు మళ్లీ అన్యాయం... సన్రైజర్స్ నుంచి మన కుర్రాళ్లు అవుట్...
యువ క్రికెటర్లలో దాగి ఉన్న సత్తాను బయటికి తీసుకురావడమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముఖ్య ఉద్దేశం. సత్తా ఉన్న యువ క్రికెటర్ల కోసం కోట్లు కుమ్మరించడానికి కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వెనుకాడవు. అయితే ఐపీఎల్లో కూడా తెలుగు కుర్రాళ్లకు పెద్దగా గుర్తింపు దక్కడం లేదు. 2008 నుంచి ఇప్పటిదాకా జరిగిన సీజన్లలో ఒక్క అంబటిరాయుడు, మహ్మద్ సిరాజ్ తప్ప, మరో తెలుగు క్రికెటర్కి పెద్దగా అవకాశాలు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు...
ఐపీఎల్ 2021 సీజన్కి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు... ఐదుగురు క్రికెటర్లను విడుదల చేసింది. వీరిలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు ఉన్నారు...
బావనక సందీప్, ఎర్రా పృథ్వీరాజ్లను మినీ వేలానికి విడుదల చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. వీరిద్దరినీ కనీస ధర పెట్టి కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్.
భారీగా ధర పెట్టి చెల్లించిన స్టార్ క్రికెటర్లను, విదేశీ క్రికెటర్లను అట్టిపెట్టుకున్న సన్రైజర్స్... కనీస ధర పెట్టి చెల్లించిన తెలుగు కుర్రాళ్లను భారంగా భావించి, వేలానికి వదిలేసింది.
28 ఏళ్ల సందీప్ను రూ.20 లక్షల బేస్ ప్రైజ్కి కొనుగోలు చేసిన హైదరాబాద్, గత సీజన్లో ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు... పూర్తిగా బెంచ్కే పరిమితమయ్యాడు సందీప్...
అలాగే రెండు మ్యాచ్లు ఆడిన ఎర్రా పృథ్వీరాజ్ ఒక వికెట్ తీశాడు. అయితే అతనికి పెద్దగా అవకాశం ఇవ్వని సన్రైజర్స్, ఇప్పుడు మినీ వేలానికి వదిలేసింది.
విశాఖపట్నానికి చెందిన కెఎస్ భరత్, ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో మొదటి రెండు టెస్టులకు స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఇంతకుముందు ఐపీఎల్లో ఢిల్లీ జట్టు భరత్ను రూ.10 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది.
కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో, లిస్టు ఏలో మంచి రికార్డులు ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి ఐపీఎల్లో ఒక్క అవకాశం కూడా దక్కలేదు..
ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీలో ఆంధ్రా జట్టు పర్వాలేదనిపించినా.... రాజకీయాల్లో ఇరుక్కున్న హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమైంది...
టాలెంట్ ఉన్నవారి కంటే పలుకుబడి, ఆర్థిక స్థోమత ఉన్నవారికే హైదరాబాద్, ఆంధ్రా జట్లలో చోటు దక్కుతోందని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
తమిళనాడు జట్టు నుంచి ఓ నటరాజన్, ఓ వాషింగ్టన్ సుందర్ ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొని, ఐపీఎల్లో సత్తా చాటి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.
కేరళ నుంచి సంజూ శాంసన్, అస్సాం నుంచి రియాన్ పరాగ్ భవిష్యత్తులో భారత జట్టులో స్టార్లుగా ఎదిగే క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు..
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో సత్తా చాటిన కేరళ యంగ్ సెన్సేషన్ మహ్మద్ అజారుద్దీన్ గురించి ఈసారి వేలంలో జట్లు పోటీపడవచ్చు. ఈ కుర్రాడికి కోట్లలో ధర పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు...
మరి తెలుగు రాష్ట్రాల నుంచి ఇలా ఒక్క క్రికెటర్ అయినా ఐపీఎల్లో కానీ, ఫ్యూచర్లో భారత జట్టులో చోటు దక్కించుకోగలడా? అనేది అనుమానంగానే మారింది.
దేశవాళీ క్రికెట్లో సత్తా చాటితేనే, భారత జట్టులోకి చోటు దక్కుతుంది. దేశవాళీ టోర్నీలకే టాలెంట్ ఉన్న ప్లేయర్లను పట్టుకోవడంలో తెలుగు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు, భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రికెటర్లను అందించగలుగుతాయా? అనేది అనుమానమే.