రెండో వన్డేలో టీమిండియా ఉత్కంఠ విజయం... దీపక్ చాహార్ అద్భుత పోరాటం...
మొదటి వన్డేలో పూర్తిగా భారత్ ఆధిపత్యం సాగగా, రెండో వన్డే క్రికెట్ ఫ్యాన్స్కి కావాల్సినంత మజాను అందించింది. టాపార్డర్ ఫెయిల్ కావడంతో భారత జట్టు ఓటమి ఖాయమనుకున్న తరుణంలో తొలుత సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత దీపక్ చాహార్ అద్భుత హాఫ్ సెంచరీలతో పోరాడడంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. వరుసగా రెండో వన్డేలో గెలిచిన భారత జట్టు, సిరీస్ను సొంతం చేసుకుంది.
193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి, భారత జట్టు ఓటమి ఖాయమనుకుంటున్న సమయంలో దీపక్ చాహార్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో పోరాడాడు. అతనికి భువీ నుంచి చక్కని సహకారం దక్కడంతో భారత జట్టు 50వ ఓవర్లో విజయాన్ని అందుకుంది.
దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు, మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. 11 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన పృథ్వీషా, హసరంగ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఒక్క పరుగుకే రజిత బౌలింగ్లో బౌల్డ్ కావడంతో 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
38 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన శిఖర్ ధావన్, హసరంగ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన లంకకు అనుకూలంగా ఫలితం వచ్చింది...
మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మనీశ్ పాండే దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.
మనీశ్ పాండే... సూర్యకుమార్ యాదవ్ ఆడిన స్ట్రైయిట్ షాట్, బౌలర్ చేతిని తాకుతూ వికెట్లను గిరాటేయడంతో నాన్స్ట్రైయికింగ్ ఉన్న మనీశ్ పాండే 31 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా మూడో బంతికే డకౌట్ కావడంతో 116 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఈ ఇద్దరూ ఆరో వికెట్కి 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 44 బంతుల్లో 6 ఫోర్లతో 53 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, సందకన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత దీపక్ చాహార్తో కలిసి నెమ్మదిగా ఆడుతూ 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు కృనాల్ పాండ్యా. 54 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా, హసరంగ బౌలింగ్లో అవుట్ కావడంతో భారత జట్టు ఓటమి ఖరారైపోయిందని అనుకున్నారంతా...
అయితే 82 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్తో 69 పరుగులు చేసిన దీపక్ చాహార్, 19 పరుగులు చేసిన భువీతో కలిసి అజేయంగా 84 పరుగుల భాగస్వామ్యం జోడించి భారత జట్టుకి ఘన విజయాన్ని అందించాడు.
2009లో రవీంద్ర జడేజా తర్వాత శ్రీలంకపై హాఫ్ సెంచరీ చేసిన 8వ నెంబర్ భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు దీపక్ చాహార్...