టీమిండియాలో చీలిక... విరాట్ కెప్టెన్సీలో జట్టు అటువైపు, కెఎల్ రాహుల్ టీమ్ ఇటువైపు...
టీమిండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధించడంతో ఆసియా కప్ 2021పై అనుమానాలు రేగుతున్నాయి. తొలుత టీమిండియా ఫైనల్కి అర్హత సాధిస్తే, ఆసియా కప్ 2021 వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ ప్రకటించినా, ఈ టోర్నీని వాయిదా వేసేందుకు ఐసీసీ సుముఖంగా లేదని సమాచారం...
జూన్ 18 నుంచి 22 వరకూ ఇంగ్లాండ్లోని సౌంతమ్టన్లో న్యూజిలాండ్, ఇండియా మధ్య ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీని కోసమే ఐపీఎల్ను కూడా ముందుకు జరిపింది బీసీసీఐ. ముందుగా జూన్ 5న ఐపీఎల్ ముగించాలని భావించినా, భారత క్రికెటర్లకు తగినంత విశ్రాంతినిచ్చేందుకు మే 30న ముగించనుంది.
అయితే షెడ్యూల్ ప్రకారం జూన్లో టీమిండియా, శ్రీలంకలో పర్యటించాల్సి ఉంటుంది. ఆసియా కప్ 2021 ప్రారంభానికి ముందు శ్రీలంకతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది టీమిండియా.
అయితే టెస్టు ఛాంపియన్షిప్ కారణంగా ఈ సిరీస్ వాయిదా పడే అవకాశం ఉంది...
అయితే శ్రీలంక సిరీస్ తర్వాత అక్కడే ఆసియా కప్ 2021 ఆడనుంది భారత జట్టు. నిజానికి 2020లోనే ఆసియా కప్ జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది.
దీంతో మరోసారి ఈ టోర్నీని వాయిదా వేయడం కరెక్టు కాదని వాదనలు వినిపిస్తున్నాయి...
కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్లేయర్లను రెండుగా విభజించి, ఒకేసారి టీమిండియాతో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఆసియా కప్ 2021 ఆడించాలని ఆలోచన చేస్తోంది బీసీసీఐ...
ప్రస్తుతం టీమిండియా రిజర్వు బెంచ్ చాలా పటిష్టంగా ఉంది. అదీకాకుండా పూజారా, రహానే, ఇషాంత్ వంటి ప్లేయర్లు టెస్టుల్లో, చాహాల్, దీపక్ చాహార్ వంటి ప్లేయర్లు పరిమిత ఓవర్ల క్రికెట్కి మాత్రమే పరిమితమయ్యారు... కాబట్టి టీమిండియాను రెండుగా విడదీసి, ఒకేసారి రెండు టోర్నీలు ఆడించాలని అనుకుంటోందట బీసీసీఐ.
విరాట్ కోహ్లీ సారథ్యంలో ఇంగ్లాండ్లో రహానే, పూజారా, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, అశ్విన్, జడేజా, రిషబ్ పంత్, ఇషాంత్, బుమ్రా వంటి టాప్ టీమ్తో న్యూజిలాండ్తో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడుతుంది భారత జట్టు...
అలాగే కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్ వంటి ప్లేయర్లతో శ్రీలంక టూర్, ఆసియా కప్ 2021 ఆడుతుంది రెండో స్ట్రింగ్ టీమిండియా...
ఇలా విడదీయడం వల్ల టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత రెండు వారాలకు ప్రారంభమయ్యే ఇంగ్లాండ్, టీమిండియా టెస్టు సిరీస్కి కూడా ఆటగాళ్లకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది..
ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంగ్లాండ్కు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇయాన్ మోర్గాన్, టెస్టుల్లో జో రూట్ కెప్టెన్గా వ్యవహారిస్తుంటే, ఆస్ట్రేలియాకు వన్డే, టీ20ల్లో ఆరోన్ ఫించ్, టెస్టుల్లో టిమ్ పైన్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే.
అదీకాకుండా ఇలా విభజించడం వల్ల టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్ను ఎంచుకునే అవకాశం కూడా దొరుకుతుంది. ఐపీఎల్ 2020 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహారించిన కెఎల్ రాహుల్, గత ఆస్ట్రేలియా టూర్లో వైస్ కెప్టెన్గా వ్యవహారించిన విషయం తెలిసిందే.