వన్డే వరల్డ్ కప్ లో భారత్ గెలవాలంటే.. రోహిత్, రాహుల్లకు దాదా కీలక సూచన
ODI World Cup 2022: ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ నెగ్గని టీమిండియా.. స్వదేశంలో ఈసారైనా దానిని ఒడిసిపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ద్వైపాక్షిక సిరీస్ లలో అదరగొడుతున్న టీమిండియా ఐసీసీ టోర్నీలలో మాత్రం విఫలమవుతున్నది. గడిచిన రెండు మూడేండ్లుగా స్వదేశంలో అంచనాలకు మించి రాణిస్తున్న భారత జట్టు.. ఐసీసీ ట్రోఫీలలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నది. 2021తో పాటు 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ వైఫల్యం అభిమానులను నిరాశపరించింది.
అయితే ఈ రెండు టోర్నీలలో భారత్ వైఫల్యానికి ప్రధాన కారణం రక్షణాత్మక ధోరణిలో ఆడటమే అని గతంలో విమర్శలు వినిపించాయి. ఒకవైపు ప్రపంచ క్రికెట్ లో అగ్రజట్లుగా దూసుకుపోతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు సంప్రదాయ క్రికెట్ విధానాలకు స్వస్తి చెప్పి దూకుడుగా ఆడటాన్ని అలవర్చుకుంటున్న తరుణంలో భారత్ కూడా ఇదే విధంగా ఆడాలని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ వచ్చేనాటికి భారత్ తమ మీదున్న అంచనాల భారాన్ని దించుకుని అగ్రెసివ్ క్రికెట్ ఆడాలి. రక్షణాత్మక ధోరణిని విడనాడి దూకుడు స్వభావాన్ని అలవర్చుకోవాలి. ట్రోఫీ గెలుస్తారా..? గెలవరా..? అన్నది పెద్ద విషయం కాదు..’అని చెప్పాడు.
అంతేగాక భారత్ లో టాలెంట్ కు కొదవలేదని, టీమిండియా ఎంతమాత్రమూ వీక్ టీమ్ కాదని గంగూలీ అన్నాడు. ‘టీమిండియా వీక్ టీమ్ కాదు. భారత్ లో టాలెంట్ కు కొదవలేదు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లో ఆడుతున్న జట్టుతోనే ప్రపంచకప్ లో బరిలోకి దిగాలి..
జట్టులో ఉన్న పలువురు యువ ఆటగాళ్లు వరల్డ్ కప్ లో ఆడలేదు. కానీ వారితోనే ఆడాలి. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్ లు టీమిండియాకు బలం. రవీంద్ర జడేజా తిరిగొస్తాడు కాబట్టి అది భారత్ కు లాభించేదే..’ అని దాదా తెలిపాడు.
ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ నెగ్గని టీమిండియా.. స్వదేశంలో ఈసారైనా దానిని ఒడిసిపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. 20 మందితో ఒక కోర్ టీమ్ ను ఏర్పాటు చేసి వారినే రొటేట్ చేసుకుంటూ వన్డే వరల్డ్ కప్ లో వారిలో బెస్ట్ 15 ని ఎంపిక చేయనుంది.