రెండో టెస్టులో గెలవాలంటే టీమిండియా ఈ మూడు మార్పులు చేయాల్సిందే...
మొదటి టెస్టులో రెండో రోజు మంచి ఆధిపత్యం కనబర్చిన టీమిండియ... మూడో రోజు మొదటి సెషన్లో పూర్తిగా తేలిపోయింది. టెస్టుల్లోనే పరమ చెత్త రికార్డు సృష్టిస్తూ 36 పరుగులకే చేప చుట్టేసింది. ఆస్ట్రేలియా బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా ఉన్నా భారత బ్యాటింగ్ ఆర్డర్ తడబాటు కూడా స్పష్టంగా కనిపించింది. రెండో టెస్టులో ఇలాంటి పరాభవం ఎదురుకాకుండా ఉండాలంటే టీమిండియా కొన్ని మార్పులు చేయాల్సిందే.
పృథ్వీషా స్థానంలో శుబ్మన్ గిల్: మొదటి టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఫెయిల్ అయిన పృథ్వీషాకి రెండో టెస్టులో స్థానం దక్కకపోవచ్చు.
ఇంత ఘోరమైన ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా అతనిపై టీమిండియా నమ్మకం పెడితే, బీభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పృథ్వీషా స్థానంలో శుబ్మన్ గిల్కి అవకాశం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో ఆకట్టుకున్న గిల్ నుంచి మినిమం రన్న్ వచ్చినా చాలనే ఆలోచనలో ఉంది టీమిండియా.
కోహ్లీ ప్లేస్లో కెఎల్ రాహుల్... మొదటి టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడంతో అనుకున్నదాని కంటే కొంచెం ముందుగానే స్వదేశానికి బయలుదేరనున్నాడు విరాట్ కోహ్లీ. రెండో టెస్టులో అతని స్థానంలో కెఎల్ రాహుల్ జట్టులోకి రావడం అనివార్యం.
అయితే కెఎల్ రాహుల్ ఓపెనర్గా ఆడతాడా? లేక కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ నాలుగో స్థానంలో వస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. గిల్ను ఓపెనర్గా పంపి, కెఎల్ రాహుల్ను నాలుగో స్థానంలో ఆడించే ప్రయత్నం చేయొచ్చు టీమిండియా...
వృద్ధిమాన్ సాహా ప్లేస్లో రిషబ్ పంత్... మొదటి టెస్టులో అవసరమైన పరుగులు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా. వికెట్ కీపింగ్లో ఆకట్టుకున్నా బ్యాటింగ్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.
సాహా ప్లేస్లో రిషబ్ పంత్కి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు, అభిమానులు. టీమిండియా మరోసారి సాహాకి ఛాన్స్ ఇస్తే తీవ్రమైన వ్యతిరేకత రావచ్చు.
షమీ స్థానంలో సిరాజ్... మొదటి టెస్టు మ్యాచ్లో గాయపడిన మహ్మద్ షమీ, టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
అతని స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సిరాజ్ బదులు ప్రాక్టీస్ మ్యాచ్లో రాణించిన నవ్దీప్ సైనీకి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.