అదొక్కటి ఉంటే చాలు, ఈసారి వరల్డ్ కప్ మనదే... టీమిండియాపై సునీల్ గవాస్కర్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టుపై భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కొందరు సంజూ శాంసన్కి చోటు ఇవ్వకపోవడం అన్యాయమంటుంటే మరికొందరు ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ షమీలను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టు సరైనదేనంటూ ప్రశంసించాడు...
‘ఒక్కసారి టీమ్ సెలక్ట్ చేసిన తర్వాత మరో ప్రశ్న రాకూడదు. అది మన టీమ్. మన జట్టుకి అందరం సపోర్ట్గా నిలవాలి. సెలక్టర్లను ప్రశ్నించడం మానుకోవాలి. ఓ ప్లేయర్ని ఎంపిక చేయడానికి, ఎంపిక చేయకపోవడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి...
నా వరకైతే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టు బాగుంది. ప్రతీ టీమ్కి కావాల్సిన కూసింత లక్ కలిసి వస్తే... ఈసారి ట్రోఫీని ఇంటికి తీసుకురాగల సత్తా మన జట్టుకి ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
సీనియర్ పేసర్ మహ్మద్ షమీని స్టాండ్బై ప్లేయర్గా ఎంపిక చేసిన సెలక్టర్లు, హర్షల్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్లకు ఫాస్ట్ బౌలర్లుగా టీ20 వరల్డ్ కప్ టీమ్లో చోటు కల్పించారు. అలాగే హార్ధిక్ పాండ్యా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉంటాడు...
యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్లను స్పిన్నర్లుగా ఎంపిక చేసిన సెలక్టర్లు, ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడింది ఒక్క మ్యాచ్ అయినా ఇంప్రెసివ్ బౌలింగ్తో ఆకట్టుకున్న యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్కి స్టాండ్బై ప్లేయర్గా అవకాశం కల్పించారు.
రవీంద్ర జడేజా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరం కాగా గత వరల్డ్ కప్ ఆడిన శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్ వంటి ప్లేయర్లు, ఈసారి జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు...