టీమిండియాను వెంటాడిన దురదృష్టం... వర్షం కారణంగా మ్యాచ్ నిలవడంతో...
మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నప్పుడు వర్షం కారణంగా ఆటకు అంతరాయం...
డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా ఆరు పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించిన అంపైర్లు...
21 బంతుల్లో 26 పరుగుల టార్గెట్ ఉన్న సమయంలో...
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టును దురదృష్టం వెంటాడింది. విజయం ముంగిక వర్షం కురవడంతో మ్యాచ్ను నిలిపివేసిన అంపైర్లు, డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా 6 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. స్మృతి మంధాన 25 పరుగులు చేయగా పూనమ్ రౌత్ 108 బంతుల్లో 11 ఫోర్లతో 77 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీరాజ్ 36, హర్మన్ప్రీత్ కౌర్ 36, దీప్తి శర్మ 36 పరుగులు చేయగా సుష్మా వర్మ 14 పరుగులు చేసింది.
249 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా 46.3 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. లిజెల్లీ లీ 131 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులు చేయగా, మెగాన్ దు ప్రీజ్ 37 పరుగులు చేసింది.
విజయానికి 21 బంతుల్లో 26 పరుగులు కావాల్సిన సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ను నిలిపివేసిన అంపైర్లు, వాన ఎంతకీ తగ్గకపోవడంతో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఫలితాన్ని ప్రకటించారు. భారత బౌలర్లు జులన్ గోస్వామి 2 వికెట్లు తీయగా రాజేశ్వరి, దీప్తి శర్మలకు చెరో వికెట్ దక్కింది.
మొదటి వన్డేలో సౌతాఫ్రికా, రెండో వన్డేలో టీమిండియా గెలవగా... తాజా విజయంతో సఫారీ జట్టు వన్డే సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యాన్ని సంపాదించింది.