INDvsENG 3rd Test: లంచ్ బ్రేక్ ముందు మరో వికెట్... నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా...
ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు... మొదటి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీకి, టీమిండియాకి ఈ ఫలితం ఏ మాత్రం సంతోషాన్ని ఇవ్వదు...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, మొదటి గంటలోనే మూడు వికెట్లు కోల్పోయింది, మొదటి సెషన్లో నాలుగు వికెట్లు కోల్పోయి, ఆతిథ్య జట్టుకి ఆధిక్యాన్ని అందించింది...
ఫామ్లో లేని విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలతో పాటు మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ కెఎల్ రాహుల్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు...
గత రెండు టెస్టుల్లో అదరగొట్టిన భారత ఓపెనర్ కెఎల్ రాహుల్... 4 బంతుల్లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. మొదటి ఓవర్ వేసిన అండర్సన్ బౌలింగ్లో బట్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్...
ఆ తర్వాత 9 బంతుల్లో 1 పరుగు చేసిన ఛతేశ్వర్ పూజారా కూడా అండర్సన్ బౌలింగ్లోనే, బట్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 4 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
అండర్సన్ బౌలింగ్లో పూజారా అవుట్ కావడం ఇది 10వ సారి కాగా, ఇంగ్లాండ్లో 8వ సారి... స్వదేశంలో జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో అత్యధిక సార్లు అవుటైన బ్యాట్స్మెన్గా పూజారా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు.
పూజారా అవుటైన తర్వాత మూడో వికెట్కి 17 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, 17 బంతుల్లో ఓ ఫోర్తో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను అజింకా రహానే, రోహిత్ శర్మ కలిసి కాసేపు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్కి 92 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
54 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన అజింకా రహానే, రాబిన్సన్ బౌలింగ్లో బట్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ ముగ్గురూ కూడా అండర్సన్ బౌలింగ్లోనే, కీపర్ జోస్ బట్లర్కి క్యాచ్ ఇచ్చి ఒకే విధంగా పెవిలియన్ చేరగా, అజింకా రహానే కూడా బట్లర్కే క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం విశేషం...
ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్లో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 75 బంతుల్లో ఒక్క ఫోర్తో 15 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. తొలి సెషన్లో దాదాపు సగం బంతులను రోహిత్ శర్మ ఎదుర్కోవడం విశేషం.