మూడో వన్డేలో శ్రీలంక ఘన విజయం... ఫీల్డింగ్లో టీమిండియా అట్టర్ ఫ్లాప్...
మూడో వన్డేలో ఏకంగా ఆరు మార్పులతో బరిలో దిగిన భారత జట్టు, శ్రీలంక టూర్లో తొలి పరాజయాన్ని చవిచూసింది. మూడో వన్డేలో 227 పరుగుల టార్గెట్ను ఆడుతూ పాడుతూ చేధించిన లంక జట్టు, 2-1 తేడాతో భారత ఆధిక్యాన్ని తగ్గించగలిగింది.
17 బంతుల్లో 7 పరుగులు చేసిన మినోద్ భనుక అవుట్ కావడంతో 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది శ్రీలంక.
అయితే ఆవిష్క ఫెర్నాండో, రాజపక్ష కలిసి రెండో వికెట్కి 109 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 56 బంతుల్లో 12 ఫోర్లతో 65 పరుగులు చేసిన రాజపక్షను అవుట్ చేసిన చేతన్ సకారియా, ఆ తర్వాతి ఓవర్లో ధనుంజయ డి సిల్వను కూడా పెవిలియన్ చేర్చాడు.
నాలుగో వికెట్కి 43 పరుగుల భాగస్వామ్యం జోడించిన చరిత్ అసలంక 28 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత లంక కెప్టెన్ దసన్ శనక, రాహుల్ చాహార్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. అయితే ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 98 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 76 పరుగులు చేసి ఎంతో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ, తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఫెర్నాండోని రాహుల్ చాహార్ అవుట్ చేసినా, అప్పటికే విజయానికి 13 పరుగుల కావాల్సిన స్థితికి చేరుకుంది లంక జట్టు. అయితే విజయానికి 7 పరుగులు కావాల్సిన దశలో కరుణరత్నే అవుట్ కావడంతో కాస్త ఉత్కంఠ రేగింది.
అయితే వస్తూనే బౌండరీ బాదిన ధనంజయ, శ్రీలంక జట్టుకి విజయాన్ని అందించాడు. టీమిండియా ఫీల్డర్లలో మనీశ్ పాండే రెండు, నితీశ్ రాణా, పృథ్వీషా, శిఖర్ ధావన్ వంటి ప్లేయర్లు క్యాచులు డ్రాప్ చేయడంతో భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
భారత బౌలర్లలో చేతన్ సకారియా రెండు, రాహుల్ చాహార్ మూడు వికెట్లు తీయగా కృష్ణప్ప గౌతమ్, హార్ధిక్ పాండ్యాలకు తలా ఓ వికెట్ దక్కింది...
భారత జట్టు చేతుల్లో వరుసగా స్వదేశంలో 9 వన్డేలు ఓడిన శ్రీలంక జట్టుకి ఇది 2012 తర్వాత దక్కిన మొట్టమొదటి విజయం...