జయహో భారత్... నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం, సిరీస్ సేఫ్...
మూడో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో దక్కిన ఓటమికి టీమిండియా త్వరగానే ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్ పిచ్పై ఇంగ్లాండ్ జట్టును 210 పరుగులకి ఆలౌట్ చేసి, 157 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు టెస్టు సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది భారత జట్టు. దీంతో ఆఖరి టెస్టు డ్రా చేసుకున్నా, సిరీస్ దక్కుతుంది. ఒకవేళ ఓడినా సిరీస్ సమం అవుతుంది కానీ కోల్పోయే ప్రమాదం ఉండదు...
బ్యాట్స్మెన్కి స్వర్గధామంగా మారిన ఓవల్ పిచ్పై భారత బౌలర్లు అద్భుతం చేశారు. తొలి వికెట్కి భారీ భాగస్వామ్యం నెలకొల్పి 100/0 ఉన్న ఇంగ్లాండ్ జట్టుపై చిరుతపులుల్లా విరుచుకుపడి, వికెట్లను వెంటాడారు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ జో రూట్, ఓల్లీ పోప్, బెయిర్ స్టో, ఓవర్టన్ క్లీన్బౌల్డ్ అయ్యారంటే మనోళ్ల బౌలింగ్ ఎలా సాగిందో చెప్పొచ్చు...
ఓవర్నైట్ స్కోరు 77/0 వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు, తొలి వికెట్కి సెంచరీ భాగస్వామ్యం అందుకుని 100/0 స్కోరుతో డ్రా దిశగా సాగుతున్నట్టు కనిపించింది.
అయితే శార్దూల్ ఠాకూర్ తన తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్కి షాక్ ఇచ్చాడు. తొలి వికెట్కి 100 పరుగులు జోడించిన తర్వాత 50 పరుగులు చేసిన రోరీ బర్న్స్ను అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు... ఆ తర్వాత డేవిడ్ మలాన్ రనౌట్ అయ్యాడు...
లంచ్ బ్రేక్ విరామానికి ముందు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసింది. హసీబ్ హమీద్తో పాటు జో రూట్ కూడా క్రీజులో కుదురుకుపోవడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్నట్టు కనిపించింది.
అయితే లంచ్ బ్రేక్ తర్వాత భారత బౌలర్లు అద్భుతం చేశారు. ఒక్కొక్కరిగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్పై విరుచుకుపడ్డారు. 193 బంతుల్లో 6 ఫోర్లతో 63 పరుగులు చేసిన హసీబ్ హమీద్ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు...
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచిన ఓల్లీ పోప్ను క్లీన్బౌల్డ్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా... 11 బంతులాడిన ఓల్లీ పోప్ కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు.
జస్ప్రిత్ బుమ్రాకి టెస్టుల్లో ఇది 100వ వికెట్. 24 మ్యాచుల్లో 100 టెస్టు వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, అత్యంత వేగంగాఈ ఫీట్ సాధించిన భారత పేసర్గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు...
ఓల్లీ పోప్ను అవుట్ చేసిన తర్వాతి ఓవర్లోనే జానీ బెయిర్స్టోని డకౌట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. దీంతో 146 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...
ఆ తర్వాత మొయిన్ ఆలీ కూడా డకౌట్ అయ్యాడు. జడ్డూ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు మొయిన్ ఆలీ, 147 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...
ఒకానొక దశలో 100/0 స్కోరుతో మంచి పటిష్టమైన పొజిషన్లో కనిపించిన ఇంగ్లాండ్, వరుసగా ఆరు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది... ఈ దశలో జో రూట్, క్రిస్ వోక్స్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ ఏడో వికెట్కి 13 ఓవర్లలో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 78 బంతుల్లో 3 ఫోర్లతో 36 పరుగులు చేసి, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఈ సిరీస్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ కావడం జో రూట్కి ఇది రెండోసారి.
182 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్, టీ బ్రేక్ విరామానికి ముందు క్రిస్ వోక్స్ వికెట్ కూడా కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో షాట్కి ప్రయత్నించిన క్రిస్ వోక్స్, రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
29 బంతుల్లో ఓ ఫోర్తో 10 పరుగులు చేసిన క్రెగ్ ఓవర్టన్ని ఉమేశ్ యాదవ్ క్లీన్బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అండర్సన్ కూడా ఉమేశ్ బౌలింగ్లోనే అవుట్ కావడంతో ఇంగ్లాండ్ ఘోర పరాజయం పాలైంది...