ప్రమోషన్ చేయడానికి ఇంత బిల్డప్ అవసరమా! ధోనీ ‘ఓరయ్యో ఓరయ్యా’ ఏందయ్యా ఇది...
మహేంద్ర సింగ్ ధోనీ... మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్, బెస్ట్ ఫినిషర్! ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే. మరోవైపు మాహీ పక్కా కమర్షియల్ పర్సన్. ప్రపంచమంతా కరోనా కలకలం రేగిన సమయంలో కూడా ఎమ్మెస్ ధోనీ ఒక్క రూపాయి విరాళంగా ఇచ్చిన పాపాన పోలేదు. తాజాగా మరోసారి తన కమర్షియల్ పంథాతో అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశాడు ధోనీ...
కరోనా సెకండ్ వేవ్ సమయంలో మాహీ ఓ సంస్థకు లక్ష రూపాయలు విరాళం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. రూ.800 కోట్ల ఆస్తులు ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, ఓ మధ్యతరగతి మనిషి కంటే దారుణంగా రూ.1 లక్ష ఇచ్చాడనే వార్త సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది... లేదు లేదు... మాహీ రూ.1 కోటి ఇచ్చాడు, రూ.10 కోట్లు ఇచ్చాడు, రూ.100 కోట్లు ఇచ్చాడు అని ప్రచారం జరిగినా అది ఉట్టి పుకార్లేనని తర్వాత తేలింది.
స్వాతంత్య్ర దినోత్సవం అప్పుడు కానీ, 2020-21లో భారత జట్టు గబ్బాలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సమయంలో కానీ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్క ట్వీట్ కానీ, సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కానీ చేసింది లేదు. ప్రమోషన్స్, బ్రాండ్ అంబాసడరింగ్ పోస్టులు మాత్రం తరుచూ పోస్టు చేస్తూ వచ్చాడు ధోనీ...
తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ, ఫేస్బుక్లో లైవ్లోకి వస్తున్నాడని, ఓ కీలక ప్రకటన చేయబోతున్నాడనే వార్త అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. మాహీ ఏ ప్రకటన ఇవ్వబోతున్నాడోనని అభిమానులు ఆశగా ఎదురుచూశారు...
కొందరు మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని అంచనా వేస్తే... మరికొందరు మాహీ, మరోసారి టీమిండియాకి మెంటర్గా వస్తాడేమోనని అనుకున్నారు. ఇదంతా కాదు, మాహీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాడని బల్లగుద్ది మరీ చెప్పారు ఇంకొందరు... ఈ ఊహాగానాలు, అంచనాలతో మాహీ లైవ్లో ఏం చెబుతాడా? అని ఉత్కంఠగా ఎదురుచూశారు..
తీరా చూస్తే ‘ఓరియో’ బిస్కెట్ యాడ్ ప్రమోషన్ చేసేందుకు మహేంద్రుడు, లైవ్ చేశాడని తెలిసి అభిమానుల దిమ్మతిరిగింది. ప్రమోషన్ చేయడంలో తప్పు లేదు, అయితే ప్రమోషన్ మాత్రమే చేయడానికి సోషల్ మీడియాని వాడుతుండడం అభిమానులను షాక్కి గురి చేసింది...
ప్రమోషన్ చేయడానికి ఇంత బిల్డప్ అవసరమా? అనేది సగటు ధోనీ అభిమాని ఆవేదన. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ప్రమోషన్స్ చేశారు, డబ్బులు పోగేసుకున్నారు. అయితే మరీ ఇలా ఇంత ఓవర్ యాక్షన్ అయితే ఎవ్వరూ చేయలేదు..
ప్రమోషన్ చేయడమే ఎక్స్ట్రా అనుకుంటే అందులో మాహీ మాట్లాడిన మాటలు మరింత ఎక్స్ట్రా. ‘2011లో ఓరియో ఇండియాలో లాంఛ్ అయ్యింది, టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది... ఈసారి మళ్లీ ఓరియా రీలాంఛ్ అవుతుంది... ఈసారి కూడా ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది...’ అంటూ బ్రాండ్ ప్రమోషన్ని ఓ పెద్ద సంచలన ప్రకటనలా పదే పదే చెప్పాడు ధోనీ...
ఐపీఎల్ తప్ప మిగిలిన ఏ ఫార్మాట్లోనూ క్రికెట్ ఆడని మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2023 సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్కి కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. ఇంత హడావుడి చేసి కనీసం సీఎస్కేకి సంబంధించి ఏదో ఒక్క న్యూస్ ప్రకటించినా అభిమానులు ఇంతగా బాధపడేవాళ్లు కాదు...
పనికి వచ్చే పోస్టులు చేయడానికి టైమ్ లేదు కానీ ప్రమోషన్స్ చేయడానికి మాహీ దగ్గర బోలెడంత సమయం ఉందని మీమ్స్ వైరల్ చేస్తున్నారు ధోనీ హేటర్స్... ఎప్పుడైనా మాహీపై ట్రోల్స్ వస్తే ఆయన అభిమానులు, వాటిని గట్టిగా తిప్పికొట్టేవాళ్లు. అయితే ఈసారి ధోనీని ట్రోల్ చేస్తూ పోస్టులు చేస్తున్న వారిలో ఆయన అభిమానులు కూడా ఉండడం కొసమెరుపు...