ఇంకా విన్నింగ్ కాంబినేషన్ కావాలా కోహ్లీ... నాలుగో టెస్టులో ఈ మార్పులు చేయాల్సిందే...
ఇంగ్లాండ్ టూర్లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో టీమిండియా అద్భుతమైన ఆటతీరు చూపించింది. అయితే ఫాస్ట్ బౌలర్లు అదరగొట్టినా భారత జట్టులో కొన్ని సమస్యలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ, ఇంగ్లాండ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు..
మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్ల్లో 501 పరుగులు చేసిన జో రూట్, భారత జట్టుని ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో జో రూట్ని త్వరగా పెవిలియన్ చేర్చి ఉంటే, ఇప్పటికే టీమిండియా 2-0 తేడాతో లీడ్లో ఉండేది...
రవీంద్ర జడేజా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నా, కేవలం బ్యాటుతో కొన్ని పరుగులు చేస్తున్నాడనే కారణంగా అతన్నే కొనసాగించాడు విరాట్ కోహ్లీ. జట్టులో ప్రధాన స్పిన్నర్ లేకపోవడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది...
రవీంద్ర జడేజాలాగే రవిచంద్రన్ అశ్విన్ కూడా బ్యాటుతో రాణించగలడు. అతనికి టెస్టుల్లో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. అన్నింటికీ ముఖ్యంగా అశ్విన్కి జో రూట్పై మంచి రికార్డు ఉంది. అలాంటి మ్యాచ్ విన్నర్ను పక్కనబెట్టడం చాలా పెద్ద వ్యూహాత్మిక తప్పిదం...
అశ్విన్తో పాటు యంగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ను ఎదుర్కోవడంలో కూడా జో రూట్ చాలా ఇబ్బందిపడ్డాడు. అశ్విన్, జడేజాల్లాగే అక్షర్ పటేల్ కూడా బ్యాటుతో మెరుపులు మెరిపించగలడు. అయితే జడేజా మీద చూపించిన ఇంట్రెస్ట్ ఈ ఇద్దరిపై పెట్టడం లేదు విరాట్ కోహ్లీ...
ఇంగ్లాండ్ పిచ్లు స్వింగ్కి అద్భుతంగా సహకరిస్తాయి. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో కూడా భారత బౌలర్లు స్వింగ్ రాబట్టడంలో విఫలమయ్యారు. తొలి టెస్టులో స్వింగ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ను తీసుకుంది టీమిండియా.. అతను కీలక వికెట్లు తీసి, సత్తా చాటాడు కూడా...
శార్దూల్ ఠాకూర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదని విరాట్ కోహ్లీ, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవడంతో అతనికి తుదిజట్టులో చోటు దక్కలేదు...
అయితే మళ్లీ విన్నింగ్ కాంబినేషన్ను మార్చకూడదనే కారణంగా ఇషాంత్ శర్మను కొనసాగించింది భారత జట్టు. అతను 22 ఓవర్లు వేసినా, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అదీకాకుండా టెస్టుల్లో 4.20 రన్రేటుతో సమర్పించి ఘోరంగా విఫలమయ్యాడు...
సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, రెండో టెస్టులో ఆకట్టుకున్నాడు. అయితే అప్పుడు కూడా అతనికి తొలి ఇన్నింగ్స్లో చాలా ఆలస్యంగా వికెట్లు దక్కాయి. అలాంటి ఇషాంత్కి మరో మ్యాచ్లో విశ్రాంతిని ఇచ్చి, శార్దూల్ ఠాకూర్ని ఆడించి ఉంటే, అటు బాల్తోనూ, ఇటు బ్యాటుతోనూ మంచి ఫలితం వచ్చి ఉండేది...
ఓవల్లో జరిగే నాలుగో టెస్టులో టీమిండియా మార్పులు అనివార్యం కానున్నాయి. రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ ఖాయం అవుతుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
బ్యాటింగ్లో వరుసగా విఫలం అవుతున్న ఛతేశ్వర్ పూజారా ఫామ్లోకి రావడం ఒక్కటే టీమిండియా అభిమానులకు సంతోషాన్ని కలిగించే అంశం. అయితే పూజారా ఫామ్లోకి వచ్చాడని సంతోషించేలోపు, కెఎల్ రాహుల్ వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో ఫెయిల్ అయ్యాడు...
నాలుగో టెస్టులో కెఎల్ రాహుల్ స్థానంలో పృథ్వీషాను ఆడించాలని విరాట్ కోహ్లీ భావిస్తాడా? లేక మొదటి రెండు టెస్టుల్లో పర్ఫామెన్స్ ఆధారంగా అతన్నే కొనసాగిస్తాడా? అనేది తేలాల్సి ఉంది...
ఆస్ట్రేలియా టూర్లో, ఇంగ్లాండ్లో స్వదేశంలో జరిగిన సిరీస్లో ఆకట్టుకున్న రిషబ్ పంత్, మళ్లీ పాత ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. పంత్ ఫామ్లోకి వస్తే, టీమిండియా కష్టాలు సగం తీరినట్టే..