INDvsENG: మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... విజయానికి ఏడు వికెట్ల దూరంలో...
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు విజయం దిశగా సాగుతోంది. 482 పరుగల భారీ టార్గెట్తో బరిలో దిగిన ఇంగ్లాండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 429 పరుగులు కావాలి. భారత జట్టు విజయానికి ఇంకో ఏడు వికెట్లు తీయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలే ఉండడంతో ఈ టెస్టు ఆసక్తికరంగా మారింది...
మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 54/1 వద్ద మూడో రోజు ప్రారంభించిన భారత జట్టు, రవిచంద్రన్ అశ్విన్ అద్వితీయ సెంచరీ, విరాట్ కోహ్లీ అద్భుత హాఫ్ సెంచరీ కారణంగా రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
భారీ లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఇంగ్లాండ్, 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 25 బంతులాడి 3 పరుగులు చేసిన డొమినిక్ సిబ్లీ, అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత రోరీ బర్న్స్, లారెన్స్ కలిసి రెండో వికెట్కి 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 42 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన రోరీ బర్న్స్... రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో 49 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...
నైట్ వాచ్మెన్గా వచ్చిన ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ను అక్షర్ పటేల్ డకౌట్ చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు లీచ్.. 50 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...
38 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 19 పరుగులు చేసిన డానియల్ లారెన్స్తో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అయితే మూడో రోజు అక్షర్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు జో రూట్.
అక్షర్ పటేల్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన జో రూట్, బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో టీమిండియా రివ్యూ తీసుకుంది. రిప్లైలో బంతి వికెట్లను స్పష్టంగా తగులుతున్నట్టు కనిపించినా అంపైర్ కాల్గా నాటౌట్గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.
ఈ నిర్ణయంపై భారత సారథి విరాట్ కోహ్లీ, అంపైర్ వద్ద అసంతృప్తి వ్యక్తం చేయగా... డ్రెస్సింగ్ రూమ్లో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆశ్చర్యం, అసహనం వ్యక్తం చేయడం స్పష్టంగా కనిపించింది..