తేరుకునేలోగా అంతా జరిగిపోయింది... గాయంతో షమీ దూరం? వార్నర్ రీఎంట్రీ కన్ఫార్మ్...
ఒకే ఒక్క రోజు... రోజంతా కూడా కాదు. కేవలం 90 నిమిషాల్లో అంతా అయిపోయింది. పింక్ బాల్ టెస్టులో భారత జట్టుదే విజయం అనుకుని ధీమాగా ఉన్న భారత జట్టుకి... ఆడిలైడ్లో అనుకోని షాక్ తగిలింది. నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థి బౌలర్లు విసిరిన బంతులు, భారత ఫీల్డర్లు చేసిన తప్పులు చేయకుండా మెరుపు వేగంగా ఆసీస్ ఫీల్డర్లు అందుకున్న క్యాచ్లు... ఫలితం భారత అభిమానులు కలలో కూడా కోరుకోనిది.
చారిత్రక పింక్ బాల్ టెస్టు మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టుకి మరో షాక్ తగిలింది. రెండో ఇన్నింగ్స్లో గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన మహ్మద్ షమీ... రెండో టెస్టులో బరిలో దిగడం కష్టంగానే కనిపిస్తోంది.
‘షమీ చేతిని పైకెత్తలేకపోతున్నాడు. స్కానింగ్ కోసం పంపించాం. రిపోర్టులు వస్తే కానీ షమీ గాయం తీవ్రత గురించి తెలీదు... సాయంత్రానికి విషయం తెలుస్తుంది’ అని చెప్పుకొచ్చాడు భారత సారథి విరాట్ కోహ్లీ.
నిజానికి మొదటి టెస్టు ఆరంభానికి ముందు సీన్ వేరేగా ఉంది. భారత జట్టు టీ20 సిరీస్ గెలిచిన జోష్లో ఉంటే, ఆస్ట్రేలియా గాయాలతో సతమతమైంది...
ఓపెనర్ డేవిడ్ వార్నర్తో పాటు విల్ పుకోవిస్కీ, అబ్బాట్లు గాయంతో మొదటి టెస్టులో బరిలో దిగలేదు. ఫిట్నెస్ సాధించిన ఈ ముగ్గురూ రెండో టెస్టుకి సిద్ధమవుతున్నారు...
‘ఈ ఫీలింగ్స్ని మాటల్లో వర్ణించడం కష్టం... అసలు ఇంత తక్కువ సమయంలో ఇంత విధ్వంసం జరుగుతుందని ఊహించలేదు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే అంతా జరిగిపోయింది...
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ సమయానికి మన బాయ్స్ ఈ షాక్ నుంచి తేరుకుని, స్ట్రాంగ్గా కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...
మొదటి ఇన్నింగ్స్లో 73 పరుగులతో నాటౌట్గా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్... తన టెస్టు కెరీర్లో మొట్టమొదటిసారి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
వికెట్ కీపింగ్లో టిమ్ పైన్ ఏడు క్యాచులు కూడా అందుకున్నాడు..
2008 తర్వాత మొట్టమొదటిసారిగా ఒక్క సెంచరీ కూడా చేయకుండా, ఒక్క ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలుచుకోకుండా క్యాలెండర్ ఇయర్ని ముగించాడు విరాట్ కోహ్లీ..
పింక్ బాల్ టెస్టు గెలిచి, టీమిండియాలో విజయోత్సహం నింపి... జోష్తో స్వదేశానికి వెళ్దామని అనుకున్న విరాట్ కోహ్లీ... ఓటమి భారంతో ఇండియాకి తిరిగి రానున్నాడు.