హిట్ లిస్ట్ లో సంజయ్ బంగర్... ధోనిపై తీసుకున్న ఆ నిర్ణయమే కారణమా...?
టీమిండియా కోచింగ్ సిబ్బందిని మార్చడానికి బిసిసిఐ చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఎవరిని మార్చినా మార్చకున్నా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించరాదని బిసిసిఐ భావిస్తోందట.
ప్రపంచ కప్ ఓటమి తర్వాత బిసిసిఐ టీమిండియా ప్రక్షాళన చర్యలను ప్రారంభించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా జట్టు కోచింగ్ సిబ్బందిని మార్చడానికి వడివడిగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందుకోసం ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి ఇప్పటికే దరఖాస్తులను కూడా తీసుకుంది. అయితే ఇప్పుడున్న మొత్తం కోచింగ్ సిబ్బందిలో కొంతమందిని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో వున్న బిసిసిఐ...మరికొంతమందిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలని అనుకుంటోందట. అలా హిట్ లిస్ట్ లో వున్నవారిలో బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ దే మొదటి పేరని సమాచారం.
సహజంగానే బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఎప్పటినుండో చాలా పటిష్టమైన జట్టు. కానీ అలాంటి జట్టు ప్రపంచ కప్ కు ముందు మిడిల్ ఆర్డర్ సమస్యతో సతమతమయ్యింది. అయితే గత ప్రపంచ కప్ నుండి బంగర్ టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా పనిచేస్తున్నాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఈ సమస్యకు అతడు సరైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోయాడు.
మరీ ముఖ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ అనేది భారత జట్టు ఈ ప్రపంచ కప్ కు ముందునుండి జట్టును వేదిస్తోంది. కానీ ఆ స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగల ఆటగాన్ని బంగర్ తయారుచేయలేకపోయాడు. దీంతో ప్రపంచ కప్ టోర్నీలో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు ఈ స్థానంలో బరిలోకి దిగారు. మొదట కెఎల్ రాహుల్, విజయ్ శంకర్ చివర్లో రిషబ్ పంత్ లు ఆ స్థానంలో ఆడారు. ఇలా నాలుగో స్థానంలో నమ్మకంతో ఆడించగల ఒక్క ఆటగాన్ని కూడా బంగర్ తయారుచేయలేకపోవడం కూడా అతడిపై బిసిసిఐ గుర్రుగా వుండటానికి కారణమయ్యింది.
ఇక న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ధోనిని ఏడో స్థానంలో పంపించడంతో బంగర్ తీవ్ర విమర్శలపాలయ్యాడు. కీలకమైన మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చడంలో బ్యాటింగ్ కోచ్ గా బంగర్ పాత్రే అధికంగా వున్నట్లు ప్రచారం జరిగింది. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఈ నిర్ణయమే టీమిండియా కొంప ముంచిందని ఆరోపించారు. దీన్ని కూడా సీరియస్ గా తీసుకున్న బిసిసిఐ ఎట్టి పరిస్థితుల్లో బంగర్ ను బ్యాటింగ్ కోచ్ గా కొనసాగించరాదని భావిస్తోందట.
అయితే తాజాగా బంగర్ ధోనిని ఏడో స్థానంలో ఎందుకు పంపించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు. ఆ నిర్ణయం కేవలం తానొక్కడినే తీసుకున్నట్లుగా ప్రచారం జరగుతోందని అన్నారు. కానీ టీం మేనేజ్ మెంట్, చీఫ్ కోచ్ రవిశాస్త్రితో పాటు మిగతా కోచింగ్ సిబ్బంది అంతా కలిసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగర్ తెలిపాడు. ధోని విషయమే కాదు దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యాల విషయంలోనూ అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. కానీ ఈ ఇవన్నీ తానొక్కడినే చేసినట్లుగా బయట ప్రచారం జరగుతూ తనను విమర్శించడం ఎంతగానో బాధిస్తోందని బంగర్ ఆవేదన వ్యక్తం చేశాడు.