తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆలౌట్... ఆస్ట్రేలియాకి స్వల్ప ఆధిక్యం... సుందర్, శార్దూల్ రికార్డుల మోత...
గబ్బా టెస్టులో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు... వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ వీరోచిత బ్యాటింగ్ విన్యాసంతో మంచి స్కోరు సాధించగలిగింది. ఆరంగ్రేటం టెస్టు ఆడుతున్న సుందర్, 10 బంతుల మొదటి టెస్టు తర్వాత రీఎంట్రీ మ్యాచ్ ఆడుతున్న శార్దూల్ ఠాకూర్... ఆస్ట్రేలియా టాప్ క్లాస్ బౌలర్లకు చెమటలు పట్టించారు. ఏడో వికెట్కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి, ఆస్ట్రేలియా బౌలర్లకు పరీక్ష పెట్టారు. ఫలితంగా భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆతిథ్య ఆస్ట్రేలియాకి 33 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. శార్దూల్ ఠాకూర్ 67 పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 62 పరుగులు చేశాడు.
స్వల్ప స్కోరుకే కీలక బ్యాట్స్మెన్ అందరినీ కోల్పోయిన టీమిండియా, ప్రత్యర్థి ఆస్ట్రేలియాకి భారీ ఆధిక్యం అందించడం ఖాయమనుకున్నారంతా....
అయితే అనూహ్యంగా మొదటి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్, మొట్టమొదటిసారి టెస్టుల్లో బ్యాటింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్ కలిసి అద్భుతమై చేశారు.
టాప్ క్లాస్ బౌలర్లు ఉన్న ఆస్ట్రేలియాకు చెమటలు పట్టిస్తూ బౌండరీల మోత మోగించారు. ప్యాట్ కమ్మిన్స్, హజల్వుడ్, మిచెల్ స్టార్క్ వంటి అరవీర భయంకర బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు శార్దూల్, సుందర్.
శార్దూల్ ఠాకూర్ అయితే ఐసీసీ టాప్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో ఓ సిక్సర్తో పాటు మూడు సిక్సర్లు బాదాడు... 100వ టెస్టు ఆడుతున్న నాథన్ లియాన్ను ఓ ఆటాడుకున్నారు.
గబ్బా స్టేడియంలో ఏడో వికెట్కి టీమిండియా తరుపున మొట్టమొదటిసారి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్.
ఏడో వికెట్కి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శార్దూల్, సుందర్... బ్రిస్టేన్లో గత 21 ఏళ్లలో మూడోసారి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంతకుముందు 2003లో గంగూలీ, లక్ష్మణ్, 2014లో రహానే, మురళీ విజయ్ మాత్రమే ఇక్కడ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.
భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో, ఎనిమిదవ బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకోవడం ఇది 12వ సారి. విదేశీ పిచ్లపై మూడోసారి...
సుందర్, శార్దూల్ ఠాకూర్ ఇద్దరూ బౌలింగ్లో మూడేసి వికెట్లు తీసి, బ్యాటింగ్లో హాఫ్ సెంచరీలు నమోదుచేశారు. ఆస్ట్రేలియాలో ఈ ఫీట్ సాధించడం ఇదే తొలిసారి.
ఆరంగ్రేటం టెస్టులోనే మూడు వికెట్లు, 50+ స్కోరు చేసిన ఐదో భారత క్రికెటర్గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్. ఇంతకుముందు అమర్ సింగ్, దత్తూ పడ్కర్, సౌరవ్ గంగూలీ, హనుమ విహారి ఈ ఫీట్ సాధించారు.
ఆస్ట్రేలియాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన మూడో భారత ప్లేయర్గా నిలిచాడు శార్దూల్ ఠాకూర్. అనిల్ కుంబ్లే 87, రవీంద్ర జడేజా 81 పరుగులు చేయగా శార్దూల్ ఠాకూర్ 67 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.
115 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్... ప్యాట్ కమ్మిన్స్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే 5 పరుగులు చేసిన నవ్దీప్ సైనీ... హజల్వుడ్ బౌలింగ్లో స్మిత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
వాషింగ్టన్ సుందర్ 144 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్తో 62 పరుగులు చేసి... మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కామెరూన్ గ్రీన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
రెండు ఫోర్లతో 13 పరుగులు చేసిన మహ్మద్ సిరాజ్ను హజల్వుడ్ బౌల్డ్ చేయడంతో 336 పరుగులకి భారత ఇన్నింగ్స్కి తెరపడింది.
జోష్ హజల్వుడ్కి 5 వికెట్లు దక్కగా మిచెల్ స్టార్క్ 2, ప్యాట్ కమ్మిన్స్ 2, నాథన్ లియాన్ ఓ వికెట్ తీశారు.