- Home
- Sports
- Cricket
- IPL 2022: మాజీ సొంత జట్టుపై రివేంజ్ మ్యాచ్ కు సిద్ధమవుతున్న చాహల్.. కోహ్లితో అమీతుమీకి రె‘ఢీ’..
IPL 2022: మాజీ సొంత జట్టుపై రివేంజ్ మ్యాచ్ కు సిద్ధమవుతున్న చాహల్.. కోహ్లితో అమీతుమీకి రె‘ఢీ’..
TATA IPL2022: ఎనిమిదేండ్ల పాటు ఒక జట్టుతోనే ఉండి ఇప్పుడు సడన్ గా అదే జట్టుకు ప్రత్యర్థిగా మారడమంటే ఏ ఆటగాడికైనా కొత్తగానే ఉంటుంది. నిన్నామొన్నటిదాకా కుటుంబంలా కలిసున్న ఆటగాళ్లే.. ఇప్పుడు ప్రత్యర్థులవుతారు.

ఐపీఎల్ లో మంగళవారం సాయంత్రం ఆసక్తికర పోరు జరుగనుంది. ఎనిమిదేండ్ల పాటు ఒకే జట్టుతో కలిసి ఉన్న ఆటగాడు.. ఇప్పుడు మరో జట్టు తరఫున ఆడుతూ తిరిగి తన సొంత ఫ్రాంచైజీలా భావించిన ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఆడనున్నాడు. రిటెన్షన్ ప్రక్రియతో పాటు వేలంలో తనను తీసుకోని జట్టు పై రివేంజ్ తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
రివేంజ్ తీర్చుకోవడానికి రెడీగా ఉన్న ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ అయితే ఆ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కానున్నది. మంగళవారం సాయంత్రం ఈ రెండు జట్ల మధ్య సీజన్ లో తొలి ఫైట్ జరుగనుంది.
2014 నుంచి 2021 దాకా ఆర్సీబీ తరఫున ఆడిన యుజ్వేంద్ర చాహల్ ను గతేడాది ముగిసిన రిటెన్షన్ ప్రక్రియలో ఆ జట్టు తీసుకోలేదు. అంతేగాక వేలం ప్రక్రియలో కూడా అతడిని పట్టించుకోలేదు. కానీ చాహల్ ను రాజస్థాన్ రాయల్స్ వేలంలో దక్కించుకుంది.
ఇటీవలే ఇందుకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ... ‘ఆర్సీబీతో నాకు చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఆ జట్టు తరఫున నేను చాలా మ్యాచులు ఆడాను. అసలు ఐపీఎల్ లో మరే ఇతర జట్టుతో ఆడతానని నేనైతే కలలో కూడా ఊహించలేదు. అంతగా ఆ జట్టుతో, అక్కడి అభిమానులతో కలిసిపోయాను.
నన్ను రిటైన్ చేసుకుంటామని గానీ, వేలంలో దక్కించుకుంటామని గానీ ఆర్సీబీ యాజమాన్యం నాతో చెప్పలేదు. ఒకవేళ వాళ్లు నాతో నిన్ను మేం వేలంలో దక్కించుకుంటాం.. అని చెప్పి ఉంటే సంతోషంగా యెస్ చెప్పేవాన్ని. డబ్బు నాకు సెకండరీ. కానీ వాళ్లు నాతో అలా చెప్పలేదు...’ అని వాపోయాడు.
ఆర్సీబీ తీరుపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లగక్కిన చాహల్.. ఇప్పుడు అదే జట్టుపై తొలిసారి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లి, యుజ్వేంద్ర చాహల్, ఏబీ డివిలియర్స్ వంటి కోర్ ప్లేయర్లతో ఉండేది. మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్వెల్, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లందరితోనూ చాహల్ కు మంచి సంబంధాలున్నాయి.
అయితే ఈ సారి ఏబీడీ రిటైర్ కాగా చాహల్ రాజస్థాన్ కు వెళ్లాడు. సిరాజ్, కోహ్లిలు మాత్రమే ఆ జట్టుతో చాలాకాలం నుంచి ఉన్న ఆటగాళ్లుగా మిగిలారు.
ఇన్నాళ్లు కెప్టెన్సీ కోహ్లి సారథ్యంలో ప్రత్యర్థులకు చుక్కులు చూపించిన చాహల్.. ఇప్పుడు అదే మాజీ సారథికి బౌలింగ్ వేయనున్నాడు. ఈ ఇద్దరి మధ్య నేడు రాత్రి ఆసక్తికర పోరు జరగడం ఖాయం.
2014 నుంచి 2021 దాకా ఆర్సీబీతోనే ఉన్నాడు. మొత్తంగా చాహల్.. 114 మ్యాచులాడితే 113 ఆర్సీబీ (ఒక్కటి ముంబై తరఫున) తరఫునే ఆడాడు. ఇందులో 139 వికెట్లు తీసుకున్నాడు.ఇవన్నీ విరాట్ కోహ్లి సారథ్యంలోనే కావడం గమనార్హం.