టీమిండియాలో ముగిసిన రవిశాస్త్రి శకం... కెప్టెన్గా విరాట్ కోహ్లీకి, కోచ్గా వారికి ఆఖరి మ్యాచ్...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో భారత జట్టు కథ ముగిసింది. సూపర్ 12 రౌండ్లో నమీబియాతో జరిగే మ్యాచ్, టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలోనే కాదు... టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీకి, హెడ్కోచ్గా రవిశాస్త్రి అండ్ కోకి ఇదే ఆఖరి మ్యాచ్ కానుంది...
2017లో అనిల్ కుంబ్లే అర్ధాంతరంగా టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత టీమ్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రికి ఆ బాధ్యతలు అప్పగించింది క్రికెట్ అడ్వైసరీ కమిటీ (సీఏసీ)...
సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న సీఏసీ, ఏరికోరి రవిశాస్త్రిని టీమిండియా హెడ్కోచ్గా ఎంపిక చేసింది. రవిశాస్త్రికి ఏటా రూ.8 కోట్లు చెల్లిస్తోంది బీసీసీఐ. మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కంటే రూ. కోటిన్నర ఎక్కువ తీసుకుంటున్నాడు రవిశాస్త్రి...
2019 వన్డే వరల్డ్కప్ టోర్నీకి ముందే 2019, జూన్ 13 నాటికి రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయితే వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువును పొడగించింది బీసీసీఐ...
2019, ఆగస్టు 16న భారత సారథి విరాట్ కోహ్లీ సపోర్ట్తో భారత హెడ్కోచ్గా తిరిగి నియమితుడయ్యాడు రవిశాస్త్రి. ఆ కాంట్రాక్ట్ గడువు 2021 ఐసీసీ టీ20 వరల్డ్కప్ టోర్నీతో ముగియనుంది...
రవిశాస్త్రి కోచింగ్లో టీమిండియా కొన్ని సంచలన విజయాలు నమోదుచేసింది. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఆస్ట్రేలియా టూర్లో టెస్టు విజయాలు. 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచి సంచలనం సృష్టించింది టీమిండియా...
ఆ తర్వాత 2020 ఆస్ట్రేలియా పర్యటనలోనూ హిస్టరీ రిపీట్ చేసింది. ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత మెల్బోర్న్లో అదిరిపోయే కమ్బ్యాక్ విజయం అందుకుంది టీమిండియా... సిడ్నీ టెస్టును డ్రా చేసుకున్న భారత జట్టు, 32 ఏళ్లుగా ఓటమి ఎరుగని గబ్బాలో ఆస్ట్రేలియాని ఓడించింది భారత జట్టు...
ఇంగ్లాండ్ టూర్లో రెండు టెస్టులు గెలిచి దాదాపు టెస్టు సిరీస్ను సొంతం చేసుకున్నంత పని చేసిన భారత జట్టు, న్యూజిలాండ్ టూర్లో మాత్రం టెస్టు సిరీస్ గెలవలేకపోయింది... రెండు టెస్టుల్లోనూ చిత్తుగా ఓడింది...
రవిశాస్త్రి సారథ్యంలో భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది. 2019 ఐసీసీ వన్డే వరల్డ్కప్ టోర్నీలో సెమీస్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ కివీస్ చేతుల్లోనూ ఓడింది...
2021 టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత జట్టు తొలిసారి పాకిస్తాన్ చేతుల్లో పరాజయం చవిచూడగా, 2012 తర్వాత తొలిసారిగా గ్రూప స్టేజ్కే పరిమితమై పొట్టి ప్రపంచకప్లోనూ దారుణమైన పర్ఫామెన్స్ ఇచ్చింది...
టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీ కూడా తనదైన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలలో టీ20 సిరీస్ గెలిచిన ఏకైక కెప్టెన్గా అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు విరాట్...
మూడు ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేసిన విరాట్ కోహ్లీ, టీ20, వన్డే, టెస్టుల్లో కెప్టెన్గా 30+ విజయాలు అందుకున్న ఏకైక క్రికెట్ సారథిగా రికార్డు క్రియేట్ చేశాడు...
మొదటి టీ20 వరల్డ్కప్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత మూడు సీజన్లలో కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటించలేకపోయాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఒకే ఒక్క టీ20 వరల్డ్కప్ టోర్నీ ఆడి, ఆ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నాడు,..
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లకు టీ20 వరల్డ్కప్ టోర్నీలో నమీబియాతో జరిగే మ్యాచ్యే ఆఖరి మ్యాచ్ కానుంది...