టీమిండియా అలా ఓడిపోతుంటే, నీకు నిద్రెలా పట్టిందయ్యా శాస్త్రి... హెడ్కోచ్ రవిశాస్త్రిపై మరోసారి...
టీమిండియా ఎప్పుడు ఓడినా, మొట్టమొదట విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొనేది హెడ్ కోచ్ రవిశాస్త్రియే. 2019 వన్డే వరల్డ్కప్ సెమీ ఫైనల్ ఓటమి, ఆడిలైడ్ పరాజయం, ఐసీసీ డబ్ల్యూటీసీ ఓటమి... ఇలా ప్రతీసారీ తీవరమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు రవిశాస్త్రి...
2019 వన్డే వరల్డ్కప్ సెమీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ మధ్య సీరియస్గా మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో మత్తుగా తూలుతున్న రవిశాస్త్రి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇదే రవిశాస్త్రి ట్రోలింగ్ ఎదుర్కోవడానికి ప్రధాన కారణం...
రవిశాస్త్రికి మద్యపానం అలవాటు ఉంది. ఇప్పుడు కాదు, క్రికెటర్గా భారత జట్టులో ఉన్నప్పుడే అవకాశం దొరికినప్పుడల్లా ఫుల్లుగా తాగేవాడినని నిర్మొహమాటంగా ప్రకటించాడు రవిశాస్త్రి. తన అలవాటుని లోపంగా ఎనాడూ భావించలేదు రవిశాస్త్రి...
అయితే భారత జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మ్యాచ్ సీరియస్గా సాగుతున్నప్పుడు కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం టీమిండియా ఫ్యాన్స్కి తీవ్రంగా కోపాన్ని తెప్పించింది.
అదీకాకుండా ఎంతో క్రమశిక్షణగా ఉండే అనిల్ కుంబ్లేని, హెడ్కోచ్ పదవి నుంచి తప్పించి, ఏ మాత్రం క్రమశిక్షణ తెలియని రవిశాస్త్రికి ఆ బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
తనపై వచ్చిన ట్రోలింగ్ని ఎప్పుడూ పాజిటివ్గానే స్వీకరించేవాడు రవిశాస్త్రి. కొంతకాలంగా రవిశాస్త్రి తీరు మారింది. ఇంగ్లాండ్ టూర్లో కరోనా బారిన పడిన రవిశాస్త్రి, ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు కావడానికి కారణమయ్యాడు.
ఓ ప్రైవేట్ హోటల్లో తాను రాసిన పుస్తకావిష్కరణ సభకు జట్టు మొత్తాన్ని తీసుకెళ్లడం, అదే టీమిండియా బృందంలో కరోనా కేసులు రావడానికి కారణం కావడంతో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
తాజాగా టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్ సమయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిపోయినప్పుడే, టీమిండియా మోరల్గా ఓటమిని అంగీకరించినట్టు కనిపించింది.
ఇషాన్ కిషన్ వికెట్ పడిన తర్వాత కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారీ షాట్లకి ప్రయత్నించి అవుట్ కావడం... ఈ దెబ్బకి ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా షాట్స్ ఆడేందుకు భయపడడం జరిగిపోయాయి...
టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే, భారత క్రికెట్ ఫ్యాన్స్తో బాధతో, ఆవేదనతో మనోళ్లు ఇలా ఆడుతున్నారేంటని తెగ ఫీలైపోయారు...
అలాంటి సమయంలో కూడా భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, డగౌట్లో కునుకు తీస్తూ కనిపించాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత ఆటతీరు నిజంగానే నిద్రపుచ్చేలానే సాగింది. పాకిస్తాన్, లంక, న్యూజిలాండ్ వంటి జట్ల ఫ్యాన్స్ అయితే, వీళ్లేంటి ఇలా ఆడుతున్నాడని కునుకు తీయవచ్చు.
కానీ టీమిండియా ఫ్యాన్స్ పరిస్థితి అదికాదు. ‘డూ ఆర్ డై’ మ్యాచ్లో వీళ్లేంటి ఇలా ఆడుతున్నారని ఆవేదనతో తలలు పట్టుకున్నారు ఇండియన్ ఫ్యాన్స్. మనోళ్ల ఆటతీరు చూసిన తర్వాత చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ నిద్రలేని రాత్రులు గడిపారు.
అలాంటిది ఇండియన్ కోచ్, మ్యాచ్ జరుగుతున్నప్పుడు కునుకు తీయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 వరల్డ్కప్ టోర్నీ తర్వాత రవిశాస్త్రి, టీమిండియా హెడ్ కోచ్ నుంచి తప్పుకుంటున్నాడు. దీంతో మ్యాచ్ ఏం చూస్తాంలే... అని శాస్త్రి ఫీల్ అయి ఉంటాడని అనుకుంటున్నారు అభిమానులు...