ఆ విషయంలో విరాట్ కోహ్లీని మించిన వాళ్లు లేరు... కెప్టెన్పై తొలిసారి రోహిత్ శర్మ కామెంట్స్...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో భారత జట్టు దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఎప్పటిలాగే భారత జట్టు పరాజయానికి కెప్టెన్ విరాట్ కోహ్లీని విమర్శిస్తున్నారు అభిమానులు.. కెప్టెన్గా విరాట్ కోహ్లీ వ్యూహ్యాలు విఫలం కావడం వల్లే జట్టు ఈ పరిస్థితిలో పడిందని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు... అయితే భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, తొలిసారి విరాట్ కోహ్లీ గురించి పాజిటివ్ కామెంట్స్ చేశాడు.
రెండు ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు... అయితే విరాట్ కోహ్లీ గురించి రోహిత్ శర్మ ఎప్పుడూ కామెంట్ చేసింది లేదు...
విరాట్ మాత్రం రోహిత్ను చాలా సార్లు ప్రశంసించాడు. 2019 వన్డే వరల్డ్కప్ టోర్నీలో రోహిత్ వరుసగా ఐదు సెంచరీలు చేసిన తర్వాత ‘రోహిత్ వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్. అతనో సూపర్ స్టార్. రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే చూడడాన్ని నేనెంతగానో ఎంజాయ్ చేస్తా...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
అయితే రోహిత్ శర్మ మాత్రం విరాట్ కోహ్లీని మెచ్చుకుంటూ మాట్లాడింది లేదు. ఈ కారణాల వల్లే విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి అస్సలు పడడం లేదని వార్తలు వచ్చాయి. 2019 వన్డే వరల్డ్కప్ నుంచి ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్ సిరీస్ వరకూ ఈ వార్తలు షికార్లు చేశాయి...
తొలిసారి ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ గురించి, అతని కెప్టెన్సీ గురించి కామెంట్స్ చేశాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్... ‘విరాట్ ఎప్పుడూ విజయం కోసం ఆకలిగొన్న పులిలా కనిపిస్తాడు...
గెలవాలనే అతని కసి చూసి నాకే ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. క్రీజులోకి వెళ్లి, ఇంత నిలకడగా రాణించడం అంత ఈజీ కాదు. విరాట్ కోహ్లీ బ్యాటుతో సాధించిన సక్సెస్ అసాధ్యమైనదే...
2008లో అతను భారత జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి అతన్ని దగ్గర్నుంచి చూస్తున్నా. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా క్రికెట్ కోసం, తన ఆటను మరింతగా మెరుగు పర్చుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు విరాట్..
ఇప్పటికీ క్రికెట్ కోసం ఏం చేయడానికైనా అతను సిద్ధంగా ఉంటాడు. ఇంకేళ్లుగా చూస్తున్నా కదా, ఈ టైమ్లో భారత జట్టుకి విరాట్ కోహ్లీ చేసినంత సేవ మాలో ఎవ్వరూ చేయలేదు...
అతను ఎప్పుడూ అన్నింట్లో ముందుండాలని అనుకుంటాడు. ముందుండి నడిపించాలని తాపత్రయపడుతుంటాడు. ఆ ఆకలి ఇప్పటికీ ఇసురంత కూడా తగ్గలేదు...’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా పర్పామెన్స్ తర్వాత విరాట్, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి...
విరాట్ కోహ్లీ తర్వాత టీ20 కెప్టెన్సీ రోహిత్ శర్మకు దక్కడం దాదాపు ఖరారైపోయింది. టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత జట్టు పర్ఫామెన్స్ బాగుండి ఉంటే, ఓ పెద్ద కార్యక్రమం నిర్వహించి రోహిత్ను కెప్టెన్గా ప్రకటించాలని భావించింది బీసీసీఐ...
అయితే వరుసగా పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది భారత జట్టు. దీంతో బీసీసీఐతో పాటు ఐపీఎల్పై కూడా తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. దీంతో సైలెంట్గా కెప్టెన్సీ పగ్గాలు తీసుకోబోతున్నాడు రోహిత్ శర్మ...
2008 అండర్ 19 వరల్డ్కప్ గెలిచిన కెప్టెన్గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, ఇప్పటి దాకా 96 టెస్టుల్లో 7765 పరుగులు, 254 వన్డేల్లో 12169 పరుగులు, 92 టీ20 మ్యాచుల్లో 3225 పరుగులు చేశాడు.