గెలిస్తే సెమీస్కి, ఓడితే ఇంటికి: నాకౌట్ మ్యాచ్ గా ఇండియా వర్సెస్ కివీస్, 18 ఏళ్ల తర్వాత..
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్గా బరిలో దిగిన జట్లు, ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాయి. టాస్ కీలకంగా మారిన ఈ టోర్నీలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ వన్సైడెడ్గానే సాగాయి. హోరాహోరీ పోరు చూడొచ్చని భావంచిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా అంతే...
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్కప్ టోర్నీని ఆరంభించిన వెస్టిండీస్, దాదాపు సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. వార్మప్ మ్యాచులతో కలిపి వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన విండీస్, సూపర్ 12 రౌండ్లో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడి ఆఖరి స్థానంలో నిలిచింది...
అలాగే మరో టైటిల్ ఫెవరెట్గా బరిలో దిగిన భారత జట్టుకి కూడా టోర్నీలో ఆశించిన ఆరంభం మాత్రం దక్కలేదు. ఐసీసీ వరల్డ్కప్ టోర్నీల్లో ఇప్పటివరకూ ఓడిపోయి పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడింది టీమిండియా.
పాక్తో మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు సెమీస్ అవకాశాలన్నీ ఈ ఆదివారం జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్టుపైనే ఆధారపడి ఉన్నాయి... ఓ రకంగా చెప్పాలంటే ఇది గ్రూప్ 2లో నాకౌట్ మ్యాచ్గా మారనుంది...
భారత జట్టుతో పోలిస్తే, కాస్త పోరాడి ఓడింది న్యూజిలాండ్. టాపార్డర్ వికెట్లు తీసి మ్యాచ్ను ఇంట్రెస్టింగ్గా మార్చింది. అయితే షోయబ్ మాలిక్, అసిఫ్ ఆలీ బ్యాటింగ్తో పాక్ విజయాన్ని అందుకోగలిగింది...
పాక్ రెండు విజయాలతో టాప్లో ఉండడంతో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్ గెలిస్తేనే, టీమిండియా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది. న్యూజిలాండ్ సంగతి కూడా అంతే... ఈ మ్యాచ్ ఓడితే మరో మూడు మ్యాచులు మిగిలి ఉన్నా, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే అవుతుంది...
అయితే ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకి న్యూజిలాండ్పై ఏ మాత్రం సరైన రికార్డు లేదు. ఐసీసీ టోర్నీల్లో చివరిసారిగా 2003 వన్డే వరల్డ్కప్ టోర్నీలో న్యూజిలాండ్ను ఓడించింది టీమిండియా.
2003 మార్చి 14న జరిగిన సూపర్ 7 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 45.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జహీర్ ఖాన్ 4 వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు.
సచిన్, సౌరవ్ గంగూలీ, సెహ్వాగ్ విఫలమైనా మహ్మద్ కైఫ్ 68, రాహుల్ ద్రావిడ్ 53 పరుగుులు చేయడంతో 40.4 ఓవర్లలో విజయాన్ని అందుకుంది టీమిండియా. ఆ విజయం తర్వాత 18 ఏళ్లుగా కివీస్పై విజయాన్ని అందుకోలేకపోయింది...
2007 టీ20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లపై విజయాలు అందుకున్న భారత జట్టు... టోర్నీలో ఓడిన ఒకే ఒక్క మ్యాచ్ న్యూజిలాండ్తోనే. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 190 పరుగులు చేయగా, భారత జట్టు 180 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లోనూ ధోనీ రనౌట్ కావడం విశేషం...
రెండేళ్ల క్రితం 2019 వన్డే వరల్డ్కప్ టోర్నీ సెమీస్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన భారత జట్టు, 2021 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లోనూ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే...
ఇప్పుడు భారత జట్టు, పాకిస్తాన్పై గెలిచి చరిత్ర సృష్టించినట్టే... టీమిండియా, న్యూజిలాండ్ను చిత్తు చేసి తీరాల్సిందే. అది జరగాలంటే విరాట్ కోహ్లీ టాస్ గెలవాల్సి ఉంటుంది. టాస్ ఓడితే, మ్యాచ్ రిజల్ట్ తేడా కొట్టడం గ్యారెంటీ అని ఈ టోర్నీ గణాంకాలు చెబుతున్నాయి...
టాస్ గెలవడంలో పెద్దగా రికార్డు లేని విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లోనూ టాస్ ఓడిపోతే... తొలుత బ్యాటింగ్ చేసే టీమిండియా ఎంత భారీ స్కోరు చేస్తుందనేది కీలకంగా మారనుంది...
ఎందుకంటే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ చూసిన తర్వాత భారత బౌలర్లపై పెద్దగా నమ్మకం పెట్టుకోవడం అత్యాశే అవుతుంది. రోహిత్, కెఎల్ రాహుల్ మెరిస్తే భారత జట్టు భారీ స్కోరు చేయడం పెద్ద కష్టమేమీ కాదు...