కేన్ విలియంసన్ ఓడితే సానుభూతి, విరాట్ కోహ్లీ ఓడితే... అతను గొప్ప కెప్టెన్ అయినప్పుడు...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు, టైటిల్కి అడుగుదూరంలో నిలిచిపోయింది. మ్యాచ్ విజయాన్ని టాస్ డిసైడ్ చేస్తున్న టోర్నీలో... కేన్ విలియంసన్కి మరోసారి అదృష్టం కలిసిరాలేదు... ఎప్పుడూ విరాట్ కోహ్లీని వెంటాడే బ్యాడ్లక్, ఆయన స్నేహితుడు కేన్ విలియంసన్కి కూడా చాలా మ్యాచుల్లో తోడుగా నిలిచింది...
టీ20 వరల్డ్కప్ 2021 ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓటమితో కెప్టెన్ కేన్ విలియంసన్పై సానుభూతి వర్షం కురుస్తోంది. 2015 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఆసీస్ చేతుల్లో ఓడిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు కేన్ విలియంసన్...
ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్కప్లో సూపర్ థ్రిల్లర్గా సాగిన హై డ్రామా ఫైనల్ మ్యాచ్లో కేన్ విలియంసన్కి అదృష్టం కలిసిరాక, బౌండరీల సంఖ్య తక్కువగా ఉండడంతో టైటిల్ చేజార్చుకోవాల్సి వచ్చింది...
2021 టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లోనూ అదే గతి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్కి కేన్ విలియంసన్ 48 బంతుల్లో 85 పరుగులు చేసి భారీ స్కోరు అందించినా... సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కి అనుకూలించడంతో విజయం దక్కలేదు...
కేన్ మామ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అతనిపై సానుభూతి ట్వీట్లు, పోస్టులతో తెగ హోరెత్తిస్తున్నారు భారత క్రికెట్ అభిమానులు... అయితే భారత అభిమానులు గుర్తించని విషయం ఏంటంటే... సరిగ్గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా ఇదే...
2014 టీ20 వరల్డ్కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరిపోరాటం చేసి టీమిండియాని ఫైనల్కి చేర్చాడు. సీజన్లో 319 పరుగులు చేసిన కోహ్లీ, ఫైనల్ మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో రాణించి భారత జట్టుకి మంచి స్కోరు అందించాడు.
అయితే విరాట్ కోహ్లీకి ఎప్పుడూ కలిసి రాని అదృష్టం, ఆ మ్యాచ్లోనూ విజయాన్ని అందించలేదు. శ్రీలంక చేతుల్లో ఓడిన టీమిండియా, రెండో టీ20 వరల్డ్కప్ టోర్నీకి అడుగు దూరంలో నిలిచింది...
2016 టీ20 వరల్డ్కప్ టోర్నీలోనూ విరాట్ కోహ్లీ ఒక్కటే టీమిండియా సెమీస్ చేరడానికి కారణమయ్యాడు. టోర్నీలో అద్భుతంగా రాణించి, వరుసగా రెండు సీజన్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గెలిచాడు... అయితే 2016లోనూ టీమిండియా సెమీస్కే పరిమితమైంది...
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతుల్లో ఓడింది టీమిండియా. టోర్నీలో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ అండ్ టీమ్, ఫైనల్లో ఆ మ్యాజిక్ చూపించలేకపోయారు.
2019 వన్డే వరల్డ్కప్ టోర్నీలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. గ్రూప్ స్టేజ్లో ఐదుకి ఐదు మ్యాచుల్లో విజయాలు అందుకుని టేబుల్ టాపర్గా నిలిచింది టీమిండియా. రోహిత్ శర్మ ఐదు సెంచరీలు, విరాట్ కోహ్లీ ఐదు హాఫ్ సెంచరీలతో రికార్డులు క్రియేట్ చేశారు...
అయితే వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతుల్లో 18 పరుగుల తేడాతో ఓడింది టీమిండియా. ఈ మ్యాచ్లోనూ టాస్ రూపంలో విరాట్ కోహ్లీకి అదృష్టం కలిసి రాలేదు...
2021 డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులకు తోడు భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాతావరణం బౌలర్లకు అనుకూలించడం, టీమిండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు చక్కని ఎండ కాచి బ్యాటింగ్కి అనుకూలించడం జరిగాయి...
ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పిచ్, వాతావరణం, టాస్, తదితర అంశాలు కలిసి రావడం వల్ల న్యూజిలాండ్కి విజయం దక్కింది...
2021 టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో భారత జట్టు మొదటి రెండు మ్యాచుల్లో ఓడిపోవడానికి కూడా టాస్ కారణమైంది. టీమిండియానే కాదు, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్లు కూడా టాస్ ఓడిన మ్యాచుల్లో పరాజయం చవిచూడాల్సి వచ్చింది...
ఓ రకంగా చెప్పాలంటే కేన్ విలియంసన్, విరాట్ కోహ్లీ ఇద్దరి పరిస్థితి ఒక్కటే. విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణించి, జట్టుని విజయతీరాలకు చేర్చేందుకు తనవంతు కృషి చేశాడు. కేన్ విలియంసన్ కూడా అంతే...
అయితే కేన్ విలియంసన్కి విరాట్ కోహ్లీ కంటే కాస్త అదృష్టం ఎక్కువ. అందుకే విరాట్ కోహ్లీ 2019 సెమీ ఫైనల్లో ఓడితే, కేన్ విలియంసన్ ఫైనల్లో ఓడాడు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విరాట్ కంటే కూసింత లక్ కలిసి రావడం వల్ల కేన్ విలియంసన్ టైటిల్ సాధించాడు. అయితే కేన్ విలియంసన్ ఫైనల్లో ఓడినప్పుడు సానుభూతి చూపించే భారత క్రికెట్ ఫ్యాన్స్, టీమిండియా ఓడినప్పుడు మాత్రం విరాట్ కోహ్లీపై విద్వేషాన్ని వెల్లగక్కుతున్నారు...
కేన్ విలియంసన్ కెప్టెన్సీ కారణంగానే న్యూజిలాండ్, టీ20 వరల్డ్కప్ 2021, వన్డే వరల్డ్కప్ 2019, డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిందనేది ఎంత నిజమో... కోహ్లీ కెప్టెన్సీ కారణంగానే భారత జట్టు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్కప్ సెమీస్, డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిందనేది కూడా అంతే నిజమని గుర్తించాలని కోరుతున్నారు విరాట్ ఫ్యాన్స్...