ఆ ఇద్దరూ ఓకే అంటేనే ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్... తనదేం లేదంటున్న సౌరవ్ గంగూలీ...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో సూపర్ హిట్ మ్యాచ్ ఏదైనా ఉందంటే భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్. దాయాది దేశాల మధ్య రెండేళ్ల మధ్య జరిగిన మ్యాచ్కి రికార్డు స్థాయిలో టీఆర్పీ, వ్యూయర్షిప్ వచ్చింది.
మొబైల్ అప్లికేషన్ హాట్ స్టార్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ను లైవ్లో 1.2 కోట్ల మంది వీక్షించారు. లైవ్ స్టీమింగ్లో ఇదే రికార్డు. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచులు అంటే ఆ క్రేజ్ వేరేగా ఉంటుంది.
క్రికెట్ మ్యాచులు అస్సలు చూడని వాళ్లు కూడా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే మ్యాచ్ చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచులు నిర్వహించాలని ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
స్వాతంత్య్రానంతరం భారత్, పాకిస్తాన్ మధ్య వరుసగా ద్వైపాక్షిక సిరీస్లు జరిగాయి. 1952 నుంచి 2008 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య 58 టెస్టులు, 65 వన్డేలు, ఓ టీ20 సిరీస్ జరిగింది. ఇరుగు పొరుగు దైశాలైనా రాజకీయ, సాంఘిక, ఇతరత్రా కారణాల వల్ల ఇరు దేశాల మధ్య ఉన్న వైరం క్రికెట్పై కూడా ప్రభావం చూపించింది...
ఇంతకుముందు పలుసార్లు అనేక కారణాల వల్ల భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు రద్దు చేయబడ్డాయి. 2005, 2006 సీజన్లలో పాక్లో పర్యటించిన భారత జట్టు, 2008 ముంబై దాడుల తర్వాత 2009 జరగాల్సిన పాక్ టూర్ను రద్దు చేసుకుంది.
ఆ తర్వాత 2012లో భారత్లో పర్యటించేందుకు పాక్ జట్టును ఆహ్వానించింది బీసీసీఐ. అయితే పాక్ అందుకు అంగీకరించలేదు. 2014లో పాక్ బోర్డు, ఎనిమిదేళ్లలో ఆరు ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు బీసీసీఐతో అగ్రీమెంట్ చేసుకున్నట్టు ప్రకటించింది...
అయితే ఇరు దేశాల బోర్డుల మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో భారత్, పాక్ సిరీస్ మరింతగా క్లిష్టంగా మారుతూ వచ్చింది. 2017లో బీసీసీఐ, పాకిస్తాన్తో సిరీస్ ఆడాలంటే భారత ప్రభుత్వ అనుమతి కావాలంటూ స్పష్టం చేసింది...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో జరిగిన భారత్, పాకిస్తాన్ పోరు ఇరు జట్ల మధ్య 200వ మ్యాచ్... ఈ మ్యాచ్కి వచ్చిన స్పందన, క్రేజ్ చూసి... ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ పెడితే బాగుంటుందని కామెంట్లు వినిపించాయి...
‘రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలా? వద్దా? అనేది పూర్తిగా ఆ రెండు దేశాల క్రికెట్ బోర్డుల నిర్ణయం. ఐసీసీ, ఆ విషయంలో ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య సిరీస్ ఆడాలంటే అనేక విషయాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది...
నా అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ దరిదాపుల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు ఐసీసీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ జీవోఫ్ అల్లార్డైస్...
‘పాకిస్తాన్తో సిరీస్ ఆడాలంటే రెండు దేశాల ప్రభుత్వాల చేతుల్లో ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకుంటే నేను కానీ, పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కానీ కాదనలేం కదా...
ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ విషయంపైన దృష్టి పెడితే, సిరీస్ పెట్టడానికి మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే ఇప్పట్లో పాక్తో సిరీస్ ఆడే అవకాశం అయితే కనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...